చౌటుప్పల్, మార్చి 27 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన తంగేడువనం ఓ వైపు కాలుష్యం నుంచి పట్టణ ప్రజలను బయటపడేయడంతోపాటు మరోవైపు చక్కటి వినోదాన్ని పంచుతున్నది. 128 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తంగేడు వనం పట్టణ వాసులకు చక్కటి ఆహ్లాదాన్ని పంచుతున్నది. దశాబ్దాలుగా చౌటుప్పల్లో కనీసం ఒక్కటంటే ఒక్క పార్క్ లేకపోవడంతో వీకెండ్లలో కుటుంబ సమేతంగా హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతో ఈ తంటాల నుంచి మున్సిపాలిటీ ప్రజలకు విముక్తి లభించిందని చెప్పవచ్చు. పట్టణ వాసులను కాలుష్య కోరల నుంచి బయట పడేసేందుకు, పచ్చని చెట్ల మధ్య సేద తీరేందుకు ప్రభుత్వం తంగేడువనానికి శ్రీకారం చుట్టింది. ఈ వనంలో పెద్దలతో పాటు చిన్నారులు కాసేపు ఉల్లాసంగా గడిపేందుకు ఏర్పాట్లు చేసింది. పార్క్లో ప్రత్యేకమైన వాకింగ్ ట్రాక్తోపాటు చిన్నారులు ఆడుకునేందుకు ప్లేపార్క్ను ఏర్పాటు చేసింది. ఇందులో ఏర్పాటు చేసిన కుటీరాలు, యోగా షెడ్లు వనానికి హైలెట్గా మారాయి. పెండ్లి, పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు మున్సిపాలిటీ వాసులు తంగేడువనానికి పోటెత్తుతున్నారు.
‘వనం’తో ఆదాయం
నవంబర్ నుంచి పార్క్లోకి వీక్షకులను అనుమతిస్తున్నారు. డిసెంబర్ చివరి వారం నుంచి ప్రజల పెద్దఎత్తున పార్క్ సందర్శనకు వస్తున్నారు. ఇప్పటి వరకు వనం ద్వారా రూ.46,200 ఆదాయం వచ్చింది. జనవరి నుంచి నెలకు రూ.15వేల నుంచి 20వేల మధ్య ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో వనాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వనంలో ప్రత్యేకమైన సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రయాణికులను ఆకట్టుకుంటున్న వనం
చౌటుప్పల్ జాతీయ రహదారిపై వెళ్తున్న వారు కాసేపు సేదతీరేందుకు తంగేడువనాన్ని ఎంచుకుంటున్నారు. జాతీయ రహదారి పక్కనే లక్కారంలో ఏర్పాటు చేసిన ఈ తంగేడువనం జాతీయ రహదారిపై వెళ్తున్న వారిని ఆకట్టుకుంటుంది. ఈ పార్క్ను సందర్శించేందుకు వారు ఉత్సాహాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆంధ్ర నుంచి తెలంగాణకు బస్సుల్లో వస్తున్న వారు ఇక్కడ ఆగి.. వనం అందాలను, యాదాద్రి మోడల్ నేచురల్ పార్క్ను తిలకిస్తున్నారు. కేవలం రెండేండ్ల వ్యవధిలో రెండెకరాల విస్తీర్ణంలో ఈ వనాన్ని ఎలా పెంచారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా తంగేడువనానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.
పుట్టినరోజు వేడుకకు నిలయంగా వనం..
చౌటుప్పల్తోపాటు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు పెద్దఎత్తున ఈ పార్క్కు వస్తున్నారు. తంగేడువనంలోకి వీక్షకులను ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తున్నారు. పెద్దలకు రూ.20, చిన్నారులకు రూ.10 రుసుం వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ కెమెరా, వీడియోలు తీసుకునేందుకు రూ.50 టికెట్గా నిర్ధారించారు. వనంలో ఏర్పాటు చేసిన యాదాద్రి మోడల్ నేచురల్ పార్క్, బటర్ఫ్లై, తంగేడు, రాశివనాలను తిలకించేందుకు, ఇక్కడ ఫొటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పెండ్లి, పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు మున్సిపాలిటీ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రకృతి పరవళ్ల మధ్యన ఈ వేడుకలను జరుపుకుంటూ కొత్త అనుభూతిని పొందుతున్నారు. తక్కువ ఖర్చుతో ప్రకృతి ఒడిలో సేద తీరే అవకాశం ఉండటంతోపాటు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడంతో తమ తల్లిదండ్రులతో చిన్నారులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. పార్క్లో చిన్నారులు ఆడుకునేందుకు జారుడు బండ, నిచ్చెనలు, వీల్చైర్లు తదితర ఆట పరికరాలను ఏర్పాటు చేశారు. దాదాపు సంవత్సర కాలంగా బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న పిల్లలు జాలీగా గడిపేందుకు పార్క్ మంచి వేదికైందని చెప్పవచ్చు. వేసవిని దృష్టిలో పెట్టుకొని వనానికి వచ్చిన వారికి చల్లటి మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు.
తంగేడువనం అద్భుతం..
మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఏర్పాటు చేసిన తంగేడువనం అద్భుతంగా ఉన్నది. అక్కడ ఉన్నంత సేపు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. వనంలో ఏర్పాటు చేసిన యాదాద్రి మోడల్ ఫారెస్ట్ బాగుంది. కేవలం రెండేండ్ల వ్యవధిలోనే చిట్టడవిని పెంచడం అభినందనీయం. వనంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, పిల్లల పార్క్, యోగా షెడ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పచ్చదనం మధ్యన వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాసోజు విద్యారాణి, చౌటుప్పల్