రాయ్పూర్ : దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘోటియా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రతమత్తమై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇరువర్గాల మధ్య పావుగంట పాటు భారీగా కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో మావోయిస్టులు మూడు ఐఈడీలు పేల్చి పారిపోయారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో పోలీసులు మందుపాతర, ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకొని పోయిన నక్సల్స్ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.