నందికొండ, మార్చి 26 : తెలంగాణ ఏర్పాటు అనంతరం నాగార్జునసాగర్లోని లాంచీస్టేషన్ ఆంధ్రాప్రాంత పరిధిలోకి వెళ్లిపోయింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని హిల్కాలనీ డౌన్పార్కు వద్ద 2016లో తాత్కాలికంగా లాంచీస్టేషన్ను ఏర్పాటు చేయించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా 100సీటింగ్ సామర్థ్యం కల్గిన పల్గుణి, న్యూలాంచ్ లాంచీలను సుమారు రూ.3కోట్లతో కొనుగోలు చేసి ప్రారంభించారు. ఇక రూ.60లక్షలతో మెకానిక్ బోట్ను టూరిజం శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీంతో తక్కువ మంది పర్యాటకులతో జాలీ ట్రిప్పులను నడిపిస్తున్నది. హిల్కాలనీలోని లాంచీ స్టేషన్ నుంచి ఏటా శ్రీశైలం, ఏలేశ్వరం గట్టుకు రాకపోకలు సాగుతున్నాయి.
రూ.4.5కోట్లతో శాశ్వతంగా..
శాశ్వత లాంచీస్టేషన్ నిర్మాణం అతి త్వరలో పూర్తికానున్నది. హిల్ కాలనీలో విజయవిహార్ దిగువన 15ఎకరాల విస్తీర్ణంలో రూ.4.5కోట్లతో 2019లో ప్రారంభమైన పనులు పూర్తికావచ్చాయి. లాంచీ జెట్టి చానల్స్, అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికాగా మిగతా పనులు తుదిదశకు చేరుకున్నాయి. నూతన లాంచీస్టేషన్ అందుబాటులోకి వస్తే నాగార్జునకొండకు, 570నీటిమట్టం ఉన్నప్పుడు శ్రీశైలానికి లాంచీలు నడిపే వీలుంటుంది. ఇక్కడ అడ్వెంచర్ పాయింట్లు, రెస్టారెంట్లు, పార్కులు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్ర ప్రాంతంలో లాంచీలు నిలిపివేసినా
రెండేండ్ల కిందట ఆంధ్రప్రదేశ్లోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగి 58మంది చనిపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం ఫిట్నెస్ లేని లాంచీలను నడుపకూడదని ఆదేశించడంతో సాగర్లోనూ ఆంధ్రా లాంచీలు నిలిచిపోయాయి. మరోవైపు నాగార్జునకొండ నిర్వహణ సైతం ఆంధ్రా పరిధిలోనే ఉన్న కారణంగా తెలంగాణ లాంచీలను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో హిల్కాలనీ లాంచీ స్టేషన్ నుంచి వీకెండ్ సెలవుల్లో జాలీ ట్రిప్పులు నడుపుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఆంధ్రా ప్రజలు సైతం తెలంగాణ లాంచీల్లోనే ఏలేశ్వరాన్ని సందర్శించారు.