హైదరాబాద్ :కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఫైర్ అయ్యారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీరాజ్ పద్దులపై రేఖా నాయక్ మాట్లాడారు. అయితే స్పీకర్ పోచారం అనుమతితో ఆమె తన ప్రసంగాన్ని లంబాడీ భాషలో కొనసాగించారు. మధ్యలో ఆమె తెలుగు మాట్లాడుతుండగా.. లంబాడీ భాషలోనే కంటిన్యూ చేయండి అని స్పీకర్ ప్రోత్సహించారు.
రాష్ర్ట ప్రభుత్వం తండాలు, గూడెంల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను రేఖా నాయక్ వివరిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రన్నింగ్ కామెంట్రీ చేశారు. తండాలు, గిరిజన గూడెంలలో అభివృద్ధి ఎక్కడా? అంటూ సీతక్క వ్యాఖ్యానించారు. దీంతో రేఖానాయక్ నిప్పులు చెరిగారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గిరిజన బిడ్డవు నీవు ఒక్కదానివే కాదు.. తాను కూడా ఓ గిరిజన బిడ్డను అని సీతక్కకు రేఖా నాయక్ ధీటుగా సమాధానం ఇచ్చారు. బాపునగర్ తండా బాధలు, ఇంద్రవెల్లి, ఉట్నూరు గిరిజనుల బాధలు నీకేం తెలుసు అని కడిగి పాడేశారు. మా ఓట్లతో గెలిచావు కానీ.. మా సమస్యలు పట్టవు అంటూ సీతక్కపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండాలు, గూడెంలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తంలో ఉన్న కాంగ్రెస్ నాయకురాళ్లు ఇందిరాగాంధీ, గీతారెడ్డి, రేణుకా చౌదరి తండాల్లో పర్యటించేవారు.. కానీ ఆడబిడ్డలు నీళ్ల కోసం పడుతున్న కష్టాలను పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తండాలకు కూడా మిషన్ భగీరథ కింద సురక్షితమైన తాగునీరును సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు. తండాలకు, గూడేలకు త్రీ ఫేజ్ కరెంట్ అందించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు.