కరోనా వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, అనారోగ్య సమస్యల్లో చిక్కుకొనే సామాన్య ప్రజలను, నిరుపేదలను ప్రభుత్వ దవాఖానలు మాత్రమే ఆదుకోగలవని తెలంగాణ ప్రభుత్వం ముందే ఊహించింది. అందుకే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థను బాగు చేయడంపై దృష్టి పెట్టింది. అప్పుడు మొదలు పెట్టిన పని ఈ ఆపత్కాలంలో ఎంతో ఉపయోగపడుతున్నది. పీహెచ్సీల నుంచి జిల్లా ఆస్పత్రుల దాకా ఎంతో మెరుగుపడటంతో ఇప్పుడు ఎక్కడికక్కడ కరోనా చికిత్సలు చేయగలుగుతున్నారు. మహారాష్ట్ర, హరియానాలో సోమవారం ఒక్కరోజే ఆక్సిజన్ కొరతతో 9 మంది చనిపోయారు. తెలంగాణలో అలాంటి విషాదకర పరిస్థితులు తలెత్తకపోవడానికి ఎక్కడికక్కడ మౌలిక సదుపాయాల కల్పన కొంత ఉపయోగపడుతున్నది. ప్రైవేటు రంగం నుంచి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ప్రభుత్వ వ్యవస్థే అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి ఇప్పుడు రాష్ట్రాన్ని ఆదుకుంటున్నది. కరోనాకు జిల్లాల్లోనే చికిత్స జరుగుతుండటంతో హైదరాబాద్పై ఒత్తిడి తగ్గుతున్నది. ప్రజలకు వ్యయప్రయాసలు కొంత వరకు తప్పుతున్నవి.
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గడిచిన ఆరున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వైద్యరంగాన్ని బలోపేతం చేసిన తీరు.. ప్రస్తుత కరోనా విపత్కర వేళ ప్రజలకు భరోసానిస్తున్నది. అనేక రాష్ర్టాల్లో కరోనా రోగులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటే.. తెలంగాణలో మాత్రం ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఈ ప్రాంతంలో కునారిల్లిన రంగాల్లో వైద్యం ఒకటి. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్యరంగంపైనా దృష్టి సారించిన కేసీఆర్.. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేశారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి దవాఖానలను బలోపేతం చేయడంతోపాటు, జిల్లా దవాఖానలు, ఏరియా హాస్పిటళ్లు, పీహెచ్సీల్లో ప్రత్యేకంగా వసతులు కల్పించారు. కావల్సినంత మంది వైద్యులను, సిబ్బందిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను దాదాపు 50 రెట్లు పెంచారు. కరోనా మొదటి వేవ్లో ప్రత్యేకంగా గచ్చిబౌలిలో టిమ్స్ దవాఖానను ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నింటి కారణంగానే రాష్ట్రంలో కరోనా సెకండ్వేవ్ను సమర్థంగా ఎదుర్కొనగలుగుతున్నామని వైద్యులు చెప్తున్నారు.
మాతా శిశు సంరక్షణ
గత ప్రభుత్వాల హయాంలో సర్కార్ దవాఖానల్లో పురుడు పోసేందుకూ సరైన సదుపాయాలుండేవి కాదు. దీంతో ప్రైవేట్కు వెళ్లి వేలల్లో ఖర్చు చేసుకునేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత పీహెచ్సీ స్థాయి నుంచి మాతా శిశు సంరక్షణకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. ప్రత్యేకంగా ఐదు మెటర్నల్ ఐసీయూలు నెలకొల్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక డెలివరీ సూట్స్ 424 అందుబాటులోకి వచ్చాయి. కేసీఆర్ కిట్లతో హాస్పిటళ్లలో ప్రసవాలు పెరిగాయి.
ప్రసవం తర్వాత తల్లి, బిడ్డను ఇంటివద్ద దింపేందుకు ‘102’ సేవల కింద 241 అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటితో ప్రసూతి మరణాల సంఖ్య లక్షకు 92 నుంచి 63కు, శిశు మరణాలు 39 నుంచి 26కు తగ్గాయి. గతంలో 68% పిల్లలకు టీకాలు అందగా.. ఇప్పుడు 96% మందికి టీకాలు వేస్తున్నారు. ఈ విషయంలో దేశంలోనే టాప్-3 రాష్ర్టాల్లో తెలంగాణ ఉన్నది. కరోనా సమయంలోనూ ప్రభుత్వ దవాఖానల్లో నిరాటంకంగా ప్రసూతి సేవలు అందుతున్నాయి. కరోనా సోకిన గర్భిణులకు సైతం సురక్షితంగా పురుడుపోస్తున్నారు.
24వేలకు పెరిగిన పడకలు
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో అన్నిరకాల పడకలు కలిపి 17,130 అందుబాటులో ఉండేవి. ఈ ఆరేండ్లలో వీటిని 24 వేలకు పెంచారు. అంటే 40% పడకలు పెరిగాయి. ఆక్సిజన్ పడకలు గతంలో 234 ఉంటే.. ఇప్పుడు 12 వేలకు.. అంటే ఆరేండ్లలోనే 50 రెట్లు పెరిగాయి. గతంలో హైదరాబాద్లో మాత్రమే ఆక్సిజన్ బెడ్లు ఉండేవి. ఆక్సిజన్ అవసరమైతే హైదరాబాద్కు రిఫర్ చేసేవారు. ఇప్పుడు అన్ని జిల్లా హాస్పిటళ్లు, ఏరియా దవాఖానల్లోనూ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేయడంతో జిల్లా దాటాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫలితంగా రోగుల ప్రాణాలు నిలుపడంతోపాటు హైదరాబాద్లోని దవాఖానలపై ఒత్తిడిని తగ్గించింది. ఉస్మానియా దవాఖానలో 2014లో రోజూ 2,500 మందికిపైగా ఓపీకి వచ్చేవారు.
ఈ సంఖ్య ఇపుడు 1600కు తగ్గింది. గాంధీ దవాఖానకు గతంలో రెండువేలకుపైగా రాగా.. ఇప్పుడు 1,500కు తగ్గింది. జిల్లా దవాఖానల్లో రోజూ సగటున 300-500 మంది ఓపీ సేవలు పొందుతున్నారు. సుమారు 40-50 మంది ఇన్ పేషంట్ సేవలు వినియోగించుకొంటున్నారు. వరంగల్ ఎంజీఎంలో వెయ్యి మంది వరకు ఓపీ, 90 మంది వరకు ఐపీ సేవలు నియోగించుకుంటున్నారు. కింగ్ కోఠిలోని జిల్లా దవాఖానలో రోజుకు 300 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రధాన దవాఖానలపై ఒత్తిడి తగ్గింది. దీనికితోడు గతంలో కాగితాలకే పరిమితమైన బీబీనగర్ ఎయిమ్స్ను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసి చూపింది. ఒకప్పుడు ఐసీయూ అంటే హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి దవాఖానలే గుర్తుకొచ్చేవి. వరంగల్ ఎంజీఎం దవాఖాన వంటి ఒకటిరెండు చోట్ల తప్ప జిల్లా దవాఖానల్లో కూడా ఐసీయూలు ఉండేవి కాదు. స్వరాష్ట్రంలో అన్ని జిల్లా దవాఖానల్లో ఐసీయూలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 4 వేలకు పైగా ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయి.
ఉచితంగా డయాలసిస్
కిడ్నీ రోగుల బాధలను గతంలో ఎవరూ పట్టించుకున్న సందర్భాల్లేవు. డయాలసిస్ కోసం పేదలు పెద్ద మొత్తంలో ఖర్చుచేసుకుని ఆర్థికంగా చితికిపోయేవారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభిస్తున్నది. ప్రస్తుతం 49 కేంద్రాలు నడుస్తున్నాయి. ఏటా సగటున 10,500 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్త శిఖరాలకు వైద్య విద్య
వైద్య విద్యపైనా తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఉమ్మడి ఏపీలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలే ఉండేవి. గత ఆరేండ్లలో తెలంగాణలోనే వాటి సంఖ్య 10కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతంతో పోల్చితే ఐదారు రెట్లు సీట్లు పెరిగాయి. ఇందులో 1500 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లోనే ఉన్నాయి. పీజీ సీట్లు 531 నుంచి 1,253కు పెరిగాయి.
కరోనా వేళ.. కీలక పాత్ర
పీహెచ్సీలలో ప్రభుత్వం ముందుచూపుతో కల్పించిన సదుపాయాలు.. ఇప్పుడు కరోనా విపత్తును తట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు.. టీకాల పంపిణీ సమర్థంగా సాగుతున్నది. రోజుకు రెండు లక్షల మందికి సులభంగా టీకాలు వేయగలుగుతున్నారు. అసిమ్టమాటిక్, తక్కువ లక్షణాలతో హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నవారిని మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నగర పేదల చెంతకే వైద్యం
గతంలో హైదరాబాద్లోని పేదలకు సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కాదు. పీహెచ్సీలు నామమాత్రంగా ఉండేవి. చిన్న వ్యాధులకు కూడా జనం ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయించేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నగర పేదల కోసం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే 226 బస్తీ దవాఖానలు పనిచేస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మంది వైద్యం పొందుతున్నారు. 200 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి అనుబంధంగా డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ప్రారంభమయ్యాయి.
మా శ్రమను మరిచిపోతున్నాం
రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటళ్లలో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా జిల్లా హాస్పిటళ్లు బలోపేతం అయ్యాయి. దీంతో హైదరాబాద్కు రెఫరల్ కేసులు తగ్గాయి. కరోనాకు సైతం జిల్లాల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమిస్తేనే హైదరాబాద్కు వస్తున్నారు. వారి ప్రాణాలు కాపాడటానికి మా సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు. ముఖ్యంగా కరోనా మొదటివేవ్ సమయంలో, ఇప్పుడు వారి సేవలు అమోఘం. తీవ్ర అనారోగ్యంతో మా దగ్గరికి వచ్చి.. వారు పూర్తిగా కోలుకొని తిరిగి వెళ్తుంటే మేం పడిన శ్రమ మొత్తం మరిచిపోతున్నాం.
నాణ్యమైన వైద్యం చేరువైంది
పీహెచ్సీల స్థాయిలోనే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతున్నది. చిన్నారులకు వ్యాక్సినేషన్ సహా, అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. పెద్ద వయస్సు వారికి బీపీ, షుగర్, టీబీ తదితర ముఖ్యమైన పరీక్షలను ఇక్కడే నిర్వహిస్తున్నాం. చిన్నవాటికే జిల్లా దవాఖానలు, పెద్ద హాస్పిటళ్లకు వెళ్లకుండా ఇక్కడే అవసరమైన వైద్యం అందుతున్నది. ఇప్పుడు కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నాం.