పదమూడేండ్లుగా అలుపెరగని దండయాత్రలు చేస్తున్నా.. ఒక్కసారి కూడా టైటిల్ దక్కించుకోలేకపోయిన పంజాబ్ జట్టు ఈసారి పేరులోని ఎలెవన్ తీసేసి.. పంజాబ్ కింగ్స్గా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రాహుల్, మయాంక్, గేల్, మలన్, పూరన్, హెన్రిక్స్, షమీ, జోర్డాన్, రిచర్డ్సన్తో పేపర్పై బలంగా కనిపిస్తున్న పంజాబ్.. తొలి టైటిల్ ఆశ నేరవేర్చుకుంటుందా!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
గత సీజన్ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పంజాబ్ జట్టు.. ఆఖర్లో వరుసగా ఐదు విజయాలతో నాకౌట్ ఆశలు రేపినా.. చివరికి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో సీజన్ను ముగించింది. యూనివర్సల్ బాస్ క్రిస్గేల్కు ఆరంభ మ్యాచ్ల్లో అవకాశం దక్కకపోవడం ఆ జట్టు నాకౌట్ అవకాశాలను దెబ్బతీసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఈసారి లీగ్ ఆరంభం నుంచే విండీస్ వీరుడిని ఆడించాలనుకుంటున్నట్లు పంజాబ్ యాజమాన్యం స్పష్టం చేసింది. గతేడాది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన గ్లెన్ మ్యాక్స్వెల్ను వేలంలో వదిలేసుకున్న కింగ్స్.. అంతర్జాతీయ అనుభవం లేని ఆసీస్ పేసర్ రిలే మెరిడిత్ కోసం ఏకంగా రూ. 8 కోట్లు వెచ్చించింది. అదే సమయంలో టీ20 నంబర్వన్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ను రూ. 1.5 కోట్లకే సొంతం చేసుకున్న కింగ్స్.. ఆసీస్ పేసర్ జే రిచర్డ్సన్ కోసం రూ. 14 కోట్లు పెట్టింది. తమిళనాడుకు చెందిన హిట్టర్ షారుక్ ఖాన్ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసుకున్న పంజాబ్.. జట్టులో సమతూకం తెచ్చేందుకు మోజెస్ హెన్రిక్స్కు రూ. 4.2 కోట్లు వెచ్చించింది. మినీ వేలంలో తొమ్మిది మంది ఆటగాళ్లను వదులుకొని.. ఎనిమిది మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్న పంజాబ్.. అనిల్ కుంబ్లే కోచింగ్లో ఈ సారి కప్పు కొట్టేందుకు సమాయత్తమవుతున్నది. ఈ నెల 12న ముంబై వేదికగా రాజస్థాన్తో పంజాబ్ తొలి మ్యాచ్ ఆడనుంది.
షమీపైనే భారం
పేరుకు పంజాబ్ కింగ్సే అయినా గతేడాది ఎక్కువ మంది కర్ణాటకకు చెందిన ఆటగాళ్లే జట్టు తరఫున మెరుపులు మెరిపించారు. తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రాహుల్ అత్యధిక పరుగుల జాబితా టాప్లో నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నా.. జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చలేకపోయాడు. ఇప్పటి వరకు 13 సీజన్లు ఆడిన పంజాబ్ ఒక్కటంటే ఒక్కసారే (2014లో) ఫైనల్ చేరగలిగింది. పేరు మార్చుకోవడంతో పాటు కొత్త కోర్ గ్రూప్తో బరిలో దిగుతున్న పంజాబ్ కింగ్స్ ఈ సారి టైటిల్ పట్టాలని కృతనిశ్చయంతో ఉంది. మంచి ఫామ్లో ఉన్న రాహుల్, మయాంక్కు గేల్, పూరన్ దంచుడు తోడైతే పంజాబ్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కావడం పక్కా. బ్యాటింగ్లో బలంగా ఉన్న పంజాబ్కు బౌలింగ్లో సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బంది పెడుతున్నది. మణికట్టు గాయం నుంచి కోలుకుంటున్న టీమ్ఇండియా పేసర్ షమీ పంజాబ్ ప్రధాన అస్త్రం. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో 20 వికెట్లు తీసిన షమీ.. అలాగే రెచ్చిపోవాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. అయితే వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడు లీగ్ దశలో అన్నీ మ్యాచ్లు ఆడుతాడో లేదో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అతడికి విశ్రాంతినివ్వాలనుకుంటే ఆ స్థాయి పేసర్ అందుబాటులో లేకపోవడం పంజాబ్కు ఎదురుదెబ్బ. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా.. అంతర్జాతీయ అనుభవం గల స్పిన్నర్ లోటు స్పష్టమే.
భారత ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, మయాంక్, మన్దీప్, ప్రభ్సిమ్రన్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్ప్రీత్ బ్రార్, షమీ, అర్శ్దీప్, పొరెల్, దర్శన్, షారుక్ ఖాన్, జలజ్, ఉత్కర్ష్, సౌరభ్.
విదేశీ ఆటగాళ్లు: గేల్, పూరన్, జోర్డాన్, మలన్, జే రిచర్డ్సన్, మెరిడిత్, హెన్రిక్స్, అలెన్.
కొత్తగా తీసుకున్న వాళ్లు: మలన్ (రూ. 1.5 కోట్లు), జే రిచర్డ్సన్ (రూ. 14 కోట్లు), షారుక్ (రూ. 5.25 కోట్లు), మెరిడిత్ (రూ. 8 కోట్లు), హెన్రిక్స్ (రూ. 4.2 కోట్లు), జలజ్ (రూ. 30 లక్షలు), ఉత్కర్ష్ (రూ. 20 లక్షలు), సౌరభ్ (రూ. 20 లక్షలు).
బలాలు
బలహీనతలు
మరిన్ని వార్తలు చదవండి..
బీసీసీఐ ఏసీయూ చీఫ్గా మాజీ డీజీపీ