న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చే చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం 20 క్రయోజెనిక్ ట్యాంకర్లను దిగుమతి చేసుకొన్నది. 10, 20 మెట్రిక్ టన్నుల పరిమాణం ఉన్న ఈ ట్యాంకర్లను థాయ్లాండ్ నుంచి భారత్కు చేరాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాలకు వీటిని కేటాయించారు. మరికొన్ని ట్యాంకర్లు సింగపూర్, దుబాయ్ నుంచి రావాల్సి ఉన్నది. మరోవైపు, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కొద్దిగా తీరిందని, పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని దవాఖానలు తెలిపాయి. ఢిల్లీ ప్రభుత్వం థాయ్లాండ్ నుంచి 18 క్రయోజెనిక్ ట్యాంకర్లు, ఫ్రాన్స్ నుంచి 21 ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకోనున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో నెల రోజుల్లో 44 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో కేంద్రప్రభుత్వం శుక్రవారంలోగా 8 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.