చెన్నై, మే 7: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణాన్ని స్వీకరించారు. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్తో ప్రమాణం చేయించారు. సీఎం 33 మంత్రులతో క్యాబినెట్ను ఏర్పాటు చేశారు. వీరిలో 15 మంది తొలిసారి మంత్రి పదవిని చేపట్టినవారు. ఇద్దరు మహిళలకు కూడా క్యాబినెట్లో స్థానం లభించింది. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. సీఎం స్టాలిన్ హోంశాఖ, సాధారణ పరిపాలన, దివ్యాంగుల సంక్షేమశాఖల బాధ్యతలు తీసుకొన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్టాలిన్ కుటుంబసభ్యులతోపాటు, సోదరుడు అళగిరి కుమారుడు దయానిధి, మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీర్ సెల్వం హాజరయ్యారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే కూటమి 133 సీట్లలో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకొన్నది.
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే స్టాలిన్ తమిళనాడు ప్రజలకు కరోనా భృతి ప్రకటించి తన ఎన్నికల హామీని నెరవేర్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీకుటుంబానికి రూ.2వేలు ఆర్థిక సాయం అందించేందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆవిన్ పాల ధరను లీటరుకు రూ.3 తగ్గించారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రూ.1200 కోట్లు కేటాయించారు. మహిళలకు ఉచిత రవాణా శనివారం నుంచే అమల్లోకి రానున్నది.
తమిళనాడు క్యాబినెట్లో ఒక స్టాలిన్, ఒక గాంధీ, ఒక నెహ్రూ ఉండటం విశేషం. స్టాలిన్ స్వయంగా సీఎంకాగా, జౌళిశాఖ మంత్రిగా ఆర్ గాంధీ, పురపాలక మంత్రిగా కేఎన్ నెహ్రూ పదవులను చేపట్టారు.