తనిఖీలో ఎంత వెతికినా దొరకని గంజాయి
విచారణ చేస్తే తప్ప బయటపడని విషయం
గంజాయి ముఠా అరెస్టు.. 200 కేజీలు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగ్రాకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇద్దరు నిందితుల నుంచి 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన యాదవ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. విశాఖ నుంచి ఆగ్రాకు గంజాయి తీసుకువెళ్లి విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగా ఏపీలో గంజాయి సరఫరా చేసే హరిని పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా విశాఖ నుంచి వయా హైదరాబాద్ మీదుగా ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాకు గంజాయి తరలించేందుకు రాజస్థాన్కు చెందిన దేవేందర్ సింగ్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన రవీంద్రకుమార్ పండిత్లను పరిచయం చేసుకున్నాడు. వారి లారీలో గంజాయి సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని కోసం దేవేందర్ సింగ్, రవీంద్రకుమార్లు లారీలో ప్రత్యేకంగా క్యాబిన్ను రూపొందించారు. తనిఖీలు చేసినా క్యాబిన్ను గుర్తు పట్టకుండా డ్రైవర్ సీటుకు వెనకాల ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి బయలు దేరిన లారీలో గంజాయి సరఫరా జరుగుతుందని రాచకొండ ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బుధవారం లారీని హయత్నగర్లో గుర్తించి తనిఖీలు చేశారు. కాని గంజాయి దొరుకలేదు. దీంతో డ్రైవర్ రవీంద్రకుమార్, దేవేందర్ సింగ్ను అదుపులోకి తీసుకుని విచారించగా లారీలో ఏర్పాటు చేసిన క్యాబిన్ గురించి తెలిసింది. క్యాబిన్ను తెరిచి చూడగా దాదాపు 200 కేజీల గంజాయి లభించింది. ఈ మేరకు ఇద్దరిని అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రదారులు యాదవ్, హరి పరారీలో ఉన్నారు. గంజాయి పట్టుకున్న ఎస్ఓటీ, హయత్నగర్ పీఎస్ అధికారులు, సిబ్బందిని సీపీ మహేశ్భగవత్ అభినందించి రివార్డులను అందించారు. సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ సుధీర్బాబు, ఎస్ఓటీ అదనపు డీసీపీ సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సరఫరా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. కమిషనరేట్ పరిధిలో యువత అధికంగా ఉండటంతో వారు పక్కదారి పట్టకుండా గంజాయి సరఫరాను నియంత్రిస్తున్నాం. ఇప్పటికే ఇతర రాష్ర్టాల ముఠాలను పట్టుకున్నాం. గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే.. 100 లేదా రాచకొండ వాట్సాప్ 9490617111కు సమాచారం అందించాలి. – మహేశ్భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్