హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి ఆపత్కాల సాయంలో భాగంగా పంపిణీ చేసే మే నెల సాయాన్ని సర్కారు సోమవారం అందజేసింది. మొత్తం 2,04,743 మందికి రూ.40.94 కోట్ల నగదును వారివారి ఖాతాల్లోకి బదిలీచేసింది. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, మే నెల నగదును ఖాతాల్లోకి బదిలీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు, సిబ్బంది ఆకలిబాధలను తీర్చి, అక్కున చేర్చుకొని యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. వీరి ఇబ్బందులను అర్థంచేసుకొన్న సీఎం కేసీఆర్ మానవీయకోణంలో ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా దేశంలోనే ప్రప్రథమంగా ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి చేయూతనిచ్చి, ఆదుకున్నదని తెలిపారు. ప్రత్యేక చానళ్ల ద్వారా విద్యార్థులకు డిజిటల్ తరగతులను నిర్వహించామని, ప్రమాణాలు తగ్గకుండా చర్యలు చేపట్టడాన్ని కేంద్రం ఇటీవలే ప్రశంసించిందని గుర్తుచేశారు. స్కూళ్లు తెరిచే వరకు ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి నెలకు 25 కిలోల సన్నబియ్యం, రూ.2 వేలు పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలకు ముందుగా 1,25,587 మందిని గుర్తించి రూ.25.11 కోట్లు, 3,139 టన్నుల బియ్యాన్ని అందించామని అన్నారు. ఈ సాయాన్ని మరింత మందికి వర్తింపజేయాలన్న ప్రైవేట్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరో 79,156 మందిని లబ్ధిదారులుగా ఎంపికచేశామని చెప్పారు. వీరికి ఏప్రిల్ నెలకు సంబంధించిన సాయాన్ని ఇప్పటికే అందజేశామని, రెండు విడుతల్లో ఎంపికైన 2.04 లక్షల మందికి మే నెల సాయాన్ని ఖాతాల్లో జమచేశామని, సోమ, మంగళవారాల్లో బియ్యం పంపిణీచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.