న్యూఢిల్లీ, మే 17: కరోనాపై పోరులో భాగంగా ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’ (డీఆర్డీవో) రూపొందించిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం అందుబాటులోకి వచ్చింది. తొలిబ్యాచ్ డోసులను రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ సోమవారం డీఆర్డీవో ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. 10 వేల డోసులను కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్కు అందజేశారు. కొవిడ్ చికిత్సలో ఈ ఔషధం ‘ఒక కొత్త ఆశాకిరణం’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. 2-డీజీని తొలుత ఢిల్లీ దవాఖానల్లో వినియోగించనున్నారు. పొడి రూపంలో ఉండే ఈ మందును నీటిలో కలుపుకొని తాగాలి. దీనిని వాడినప్పుడు కొవిడ్ నుంచి వేగంగా కోలుకొంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైందని, కృత్రిమ ఆక్సిజన్ అవసరం కూడా తగ్గిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రెడ్డీస్ ల్యాబ్స్తో కలిసి డీఆర్డీవో 2డీజీని అభివృద్ధి చేసింది. ఈ ఔషధం ధర ఎంత అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. జూన్కల్లా పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి రావొచ్చని రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికిగాను 2-డీజీ ఔషధానికి డీసీజీఐ ఈ నెల 1న అనుమతినిచ్చింది.
కరోనా వైరస్ మానవ శరీరంలో ఒక కణంలోకి చేరాక ఆర్ఎన్ఏను వృద్ధి చేసుకొంటుంది. తద్వారా వైరస్ పునరుత్పత్తి జరుగుతుంది. ఈ వైరస్లు ఇతర కణాలకు విస్తరించి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. 2-డీజీ ఈ ప్రక్రియను నిలువరిస్తుంది. ఆర్ఎన్ఏను వృద్ధి చేసేందుకు కావాల్సిన గ్లూకోజ్.. వైరస్కు అందకుండా అడ్డుకొంటుంది. ఫలితంగా వైరస్ వృద్ధి నిలిచిపోయి రోగి త్వరగా కోలుకొంటారు.