వారణాసి: కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వలస కార్మికులు ఆశ్రయముంటున్న ఓ పురాత భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చోటుచేసుకుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ పక్కనే ఓ పురాతన భవనం ఉన్నది. అందులో పశ్చిమబెంగాల్లోని మాల్డా నుంచి వచ్చిన వలస కార్మికులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే అది మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే శిథిలాల కింద ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు.