న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ ఉద్ధృతి) విలయం సృష్టిస్తున్నది. వైరస్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. సోమవారం నుంచి మంగళవారానికి 24 గంటల్లో కొత్తగా 3,57,229 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,02,82,833కు చేరింది. ఇదే సమయంలో వైరస్ కారణంగా 3,449 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 2,22,408కి చేరింది. గడిచిన 15 రోజుల్లోనే 50 లక్షలకు పైగా కేసులు నమోదవ్వడం కలవరపెడుతున్నది. దేశంలో ప్రస్తుతం 34,47,133 మంది చికిత్స పొందుతున్నారు. మహమ్మారి నుంచి ఇప్పటివరకూ 1,66,13,292 మంది (81.91 శాతం) కోలుకున్నారు. సోమవారం నాటికి 29,33,10,779 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది. కొవిడ్-19 మొత్తం మరణాల్లో 70 శాతం మరణాలు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారివేనని కేంద్రం తెలిపింది. కేసుల్లో అమెరికా మొదటి, భారత్ రెండో స్థానంలో ఉండగా.. కరోనా మరణాల విషయంలో అమెరికా తొలి, బ్రెజిల్ రెండో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి.
జనవరి 30, 2020 తొలి కేసు
సెప్టెంబర్ 16, 2020 50 లక్షలు (227 రోజుల్లో)
డిసెంబర్ 19, 2020 కోటి (94 రోజుల్లో )
ఏప్రిల్ 19, 2021 1.5 కోట్లు (121 రోజుల్లో)
మే 4, 2021 2 కోట్లు (15 రోజుల్లో)