పాట్నా: బీహార్లో ఇద్దరు బాలుర బ్యాంక్ ఖాతాల్లో రూ.900 కోట్లకుపైగా జమ అయ్యాయి. ఈ విషయం తెలిసి బాలుర కుటుంబాలతోపాటు ఆ గ్రామ ప్రజలు నోరెళ్లబెట్టారు. బీహార్లో గత కొన్ని రోజులుగా సాంకేతిక సమస్యల వల్ల పలువురి బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ అవుతున్నది. తాజాగా బీహార్లోని కతిహార్ జిల్లా బగౌరా పంచాయతీలోని పస్త్య గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల బ్యాంకు ఖాతాల్లో రూ.900 కోట్లకుపైగా డిపాజిట్ అయ్యాయి. విద్యార్థి గురుచంద్ర విశ్వాస్ బ్యాంకు ఖాతాలో రూ.60 కోట్లకుపైగా, మరో విద్యార్థి అసిత్ కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ.900 కోట్లకుపైగా డబ్బులు జమ అయ్యాయి.
వీరిద్దరికి ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంక్ భేలగంజ్ శాఖలో ఖాతాలున్నాయి. పాఠశాల యూనిఫామ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసిన నగదు గురించి తెలుసుకోవడానికి ఈ ఇద్దరు బాలురు తమ తల్లిదండ్రులతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్థానిక సెంట్రలైజ్డ్ ప్రిసెసింగ్ సెంటర్ (CPC)కు వెళ్లడంతో ఈ విషయం తెలిసింది. తమ బ్యాంకు ఖాతాల్లో కోట్లలో డబ్బులు జమ కావడం తెలుసుకుని వారు షాకయ్యారు.
ఈ విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతోపాటు బ్యాంకు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. మరోవైపు ఆ ఇద్దరి బాలుర ఖాతాల నుంచి నగదు విత్ డ్రా కాకుండా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. వారి బ్యాంకు ఖాతాల్లోకి కోట్లలో డబ్బులు ఎలా డిపాజిట్ అయ్యాయో అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, బీహార్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోది. ఇటీవల ఖగారియా జిల్లా భక్తియార్పూర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్ బ్యాంక్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమ అయ్యాయి. ఖగారియా గ్రామీణ బ్యాంక్ సిబ్బంది పొరపాటు వల్ల అతడి ఖాతాలో ఈ మేరకు జమ అయ్యింది. అయితే ఆ డబ్బులను డ్రా చేసుకున్న అతడు వాటిని ఖర్చు చేసినట్లు తెలిపాడు.
ప్రధాని మోదీ తన ఖాతాలో డబ్బులు వేశారని, వాటిని తిరిగి ఇచ్చేది లేదని బ్యాంకు అధికారులకు రంజిత్ దాస్ చెప్పాడు. పొరపాటు వల్ల బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.5.5 లక్షలను అతడు తిరిగి ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు.