మేడ్చల్ రూరల్, జూన్ 15: రైతుబంధు పథకం ఒక్క తెలంగాణలోనే ఉన్నదని, అది కూడా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కొనియాడారు. వానకాలం పెట్టుబడి సాయం రైతుబంధు పథకం కింద నగదును రైతు ఖాతాల్లో జమచేస్తున్న సందర్భంగా మంగళవారం మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలోని రైతు వేదిక వద్ద కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి పల్లా రాజేశ్వర్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. రైతుబంధు కింద రూ.7,500 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం మంగళవారమే ప్రారంభమైందన్నారు. దాదాపు 63.50 లక్షల మంది రైతులు రైతుబంధు ద్వారా లబ్ధి పొందనున్నారని చెప్పారు. ఎకరాకు ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు రైతు ఖాతా ల్లో 50 వేల కోట్ల నగదును జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రం 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. కేవలం ఏడేండ్లలోనే తెలంగాణ ఇంతటి ఘనత సాధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చామకూర మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.