న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిన్న మొన్న కాస్త తగ్గిన కేసులు భారీగా పెరిగాయి. మరో వైపు మరణాల్లోనూ పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,82,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 44,889 కేసులు ఎక్కువగా రికార్డయ్యాయి. మరో 441 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
24 గంటల్లో 1,88,157 మంది కోలుకొని డిశ్చారి అయ్యారని చెప్పింది. ప్రస్తుతం 18,31,000 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 నుంచి 15.13శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ వేరియంట్ సైతం విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు 8,961 కేసులు రికార్డయ్యాయని మంత్రిత్వ శాఖ వివరించింది. నిన్నటితో పోలిస్తే 0.79శాతం పెరుగుదల నమోదైంది. తాజా కొవిడ్ కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,79,01,241కు పెరిగింది. ఇందులో 3,55,83,039 మంది కోలుకోగా.. మొత్తం 4,87,202 మంది ప్రాణాలు కోల్పోయారు.