న్యూఢిల్లీ/కోల్కతా, ఏప్రిల్ 9: పశ్చిమబెంగాల్లో ఎన్నికలసంఘానికి (ఈసీ), ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేతి మమత బెనర్జీకి వివాదం ముదురుతున్నది. కేంద్ర సాయుధ దళాలపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మమతకు ఈసీ గురువారం రాత్రి నోటీసులు పంపింది. సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ దళాలపై మమత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవన్నీ అవాస్తవమని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలతో ఆమె ఇండియన్ పీనల్ కోడ్, ఎన్నికల కోడ్ నియమాలను ఉల్లంఘించారని తెలిపింది. శనివారం ఉదయం 11 గంటలలోగా నోటీసులకు సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. దీనిపై మమత స్పందించారు. ఇలాంటి నోటీసులను తాను లెక్కచేయబోనని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేయడం మానేంత వరకు తాను ఇలాంటి వ్యాఖ్యలే చేస్తానని తేల్చిచెప్పారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తున్నదని పునరుద్ఘాటించారు. పోలింగ్ రోజున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేసినా నియమావళి ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.
పశ్చిమబెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల్లో భాగంగా శనివారం 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో, బెంగాల్ మంత్రులు పార్థా బెనర్జీ, అరూప్ బిశ్వాస్ తదితర ప్రముఖులు ఈ విడుత బరిలో ఉన్నారు. పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో దాదాపు 789 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది.