ఇక్కడి ప్రజలు అదే విశ్వసిస్తున్నారు
అందుకే 2018లో జానారెడ్డిని తిరస్కరించారు
జానా ఏడుసార్లు గెలువడమే శాపమైంది
సాగర్లో నోముల భగత్ విజయం ఖాయం
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్యూలో మంత్రి జగదీశ్రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగార్జునసాగర్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఏడుసార్లు గెలిచానని గొప్పలు చెప్పుకుంటున్న జానారెడ్డిని జనం 2018లోనే తిరస్కరించినట్టు చెప్పారు. జానారెడ్డి ఏడుసార్లు గెలువడమే సాగర్కు పెద్ద శాపమైందన్నారు. ప్రచారంలో ప్రజల ఆదరణ చూస్తుంటే సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్ విజయం ఎప్పుడో ఖాయమైందని మంత్రి జోస్యం చెప్పారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మంత్రి శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఇలా..
నమస్తే : సాగర్లో ప్రచారం, ప్రజాస్పందన ఎలా ఉన్నది?
మంత్రి: ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఊరూరా ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. సాగర్లో టీఆర్ఎస్కు ఉన్నంత సంస్థాగత బలం, బలగం ఎవరికీ లేవు. గల్లీగల్లీలో టీఆర్ఎస్ ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ప్రజల స్పందన చూస్తుంటే భారీ మెజార్టీతో భగత్కుమార్ గెలుపు ఖాయమైపోయింది.
2014కు ముందు సాగర్లో పరిస్థితి ఎలా ఉన్నది?
సమైక్య పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చాలా గ్రామాలు, తండాలు తాగునీటి కోసం అల్లాడాయి. పైన ఎడమ కాల్వ, దిగువన కృష్ణానది ఉన్నా మధ్యలోని వేలాది భూములు బీళ్లుగా మిగిలాయి. ఎడమ కాల్వపై ఉన్న మొట్టమొదటి మేజర్ రాజవరంలోనూ చివరి భూములకు నీళ్లు ఇవ్వలేదు. ఎడమ కాల్వ లిఫ్టులను గాలికి వదిలేశారు. సాగర్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరందించే వరద కాల్వను సైతం రెండు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉంచారు.
టీఆర్ఎస్ హయాంలో వచ్చిన మార్పేంటి?
2014లో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా.. ఇక్కడ మాత్రం జానారెడ్డే గెలిచారు. ఇతర నియోజకవర్గాలతోపాటు ఇక్కడా అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్భగీరథతో ప్రతి గ్రామానికీ తాగునీరందించాం. రాజవరం మేజర్ను ఆధునీకరించి పూర్తిస్థాయిలో సాగునీరిచ్చాం. 80 వేల ఎకరాల ఆయకట్టు న్న వరద కాల్వను పూర్తి చేసి 2016లో ప్రారంభించాం. ఏఎమ్మార్పీ ద్వారా గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాలకు సాగు నీరిస్తున్నాం. ఇటీవల సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి లిఫ్టులకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
సాగర్లో జరిగిన అభివృద్ధి ఏంటి?
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నాగార్జునసాగర్, హాలియా పట్టణాలను మున్సిపాలిటీలుగా మా ర్చుకున్నాం. కొత్తగా తిరుమలగిరి(సాగర్) మండలాన్ని ఏర్పాటుచేశాం. అ నుముల మండలంలో జాలు కాల్వకు 4కోట్లతో ఆధునీకరణ పనులు పూర్తి చేశాం. హాలియాలో మినీస్టేడియం ని ర్మాణానికి కృషి చేశాం. సాగర్లో పాలిటెక్నిక్, బీసీ రెసిడెన్సియల్ కాలేజీల ఏర్పాటు, హాలియాలో డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన, నిడమనూరులో జూనియర్ సెషన్స్ కోర్టు, బీసీ బాలుర, బాలికల గురుకుల పాఠశాలల ఏర్పాటు, పెద్దవూరలో గిరిజన గురుకుల, మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను నెలకొల్పాం.
ఎనిమిదోసారి గెలిపించాలన్న జానారెడ్డి పిలుపుపై మీ స్పందన?
జానారెడ్డి ఏడుసార్లు గెలువడమే సాగర్కు పెద్ద శాపం. జానారెడ్డి అనుభవించిన పదవీ కాలానికి, పదవులకు ఇక్కడ అభివృద్ధికి ఏమాత్రం పొంతన లేదు. ఏం చేశారో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటీ లేదు. 2014 తర్వాత కూడా సాగర్లో అభివృద్ధి గురించి జానారెడ్డి ప్రభుత్వం వద్దకు రాలేదు. అయినా సరే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇక్కడి అభివృద్ధికి బాటలు వేశాం.
టీఆర్ఎస్కే ఎందుకు ఓటెయ్యాలి?
టీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నది. దేశంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేసిన ఏకైక పార్టీ. ఎన్నికల్లో చెప్పని అనేక పథకాలను అమలు చేస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా వంటి ఎన్నో పథకాలు మ్యానిఫెస్టోలో లేవు. అంటే ప్రజలకు ఏది చేస్తే మేలు జరుగుతుందో దాన్ని చేసి చూపిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. సాగర్ అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా 2014 నుంచి చిత్తశుద్ధితో ప్రభుత్వం కృషి చేస్తున్నది. జరిగిన, జరుగుతున్న అభివృద్ధి ప్రజల కండ్ల ముందున్నాయి. అభివృద్ధి నినాదంతో కచ్చితంగా మరోసారి టీఆర్ఎస్దే విజయం.
ఇవి కూడా చదవండి :
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’