నైట్ కర్ఫ్యూను పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావద్దని, కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూకు ప్రజలు అందరూ స్వచ్ఛందంగా సహకరించాల ని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్గౌడ్ కోరారు. పగటి వేళల్లో కూడా అవసరం లేకుండా రోడ్లపైకి రావద్దని ఆ యన కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మంత్రి క్లాక్ టవర్ చౌరస్తా, కలెక్టరేట్ చౌరస్తా వద్ద రాత్రి కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసమే రాత్రి కర్ఫ్యూ విధించిందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వెంకటేశ్వర్లుకు సూచించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం చేయాలన్నారు. ఈ సందర్భంగా రాత్రి 9 గంటల తర్వాత రహదారులపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, గూడ్స్ క్యారియర్లు, ఇతర వాహనాలను ఆపి ప్రశ్నించారు. అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. గూడ్స్ క్యారియర్లకు అనుమతి ఉండగా… మందులు నిమిత్తం ద్విచక్ర వాహనదారులు వచ్చామని మంత్రికి తెలిపారు. మంత్రివెంట కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉన్నారు.