తిరుమలగిరి, మార్చి26 : మండలంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు కానరావడం లేదు. సంతలు, కూరగాయల మార్కెట్లు, హోటళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సైతం మాస్కులు ధరించడం లేదు. శానిటేషన్ వినియోగం కూడా అంతంతే. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు
తిరుమలగిరి మండలంలోని అన్ని ప్రాథమిక కేంద్రాల్లో వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కూడా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ర్యాపిడ్ టెస్ట్లు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. 20రోజుల వ్యవధిలోనే 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారికి తగిన చికిత్స అందిస్తూనే వారి ద్వారా ఇతరులకు ప్రబలకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ 10న మండలంలో పాజిటివ్ కేసు నమోదు కాగా ఈ సంవత్సరం నెల ముందుగానే కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
తిరుమలగిరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. 45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు పీహెచ్సీలో 1,018 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 45ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వారికి కూడా వ్యాక్సిన్ వేయనున్నారు.
జాగ్రత్త వహించాలి
కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. చిన్న తప్పుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. 45 సంవత్సరాలు పైబడిన వారు కరోనా టీకా తప్పక వేయించుకోవాలి.
ఇవీ కూడా చదవండి..
ఇండియాకు రానున్న చైనా అధ్యక్షుడు !
పాత ఇమ్మిగ్రేషన్కే బైడెన్ సుముఖం