న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశలోకి వెళ్లబోతోంది. దేశంలోని అతిపెద్ద ఏజ్ గ్రూప్ అయిన 18 నుంచి 44 ఏళ్ల వారికి శనివారం నుంచే కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత కారణంగా మే 1 నుంచి 18 ఏళ్ల నిండిన వారికి ఈ ప్రక్రియ ప్రారంభం కాకపోవచ్చు. కానీ కొన్ని రాష్ట్రాలు, హాస్పిటల్స్ మాత్రం దీనికి సిద్ధంగా ఉండనున్నట్లు CoWin పోర్టల్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. అయితే తొలిసారి ఈ ఏజ్ గ్రూప్లోని వారికి ఏ వ్యాక్సిన్ కావాలో ఎంచుకునే అవకాశం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాక్సినేషన్లో వ్యాక్సిన్ ఎంచుకునే అవకాశం రాలేదు. అయితే ఇక నుంచి కేంద్రంతోపాటు రాష్ట్రాలు, ప్రైవేటు వాళ్లు కూడా వ్యాక్సిన్లు వేయనున్నారు. ప్రభుత్వ కేంద్రాలు తమ దగ్గర ఉండే వ్యాక్సిన్లు వేస్తారు. అయితే ప్రైవేటు సెంటర్లలో మాత్రం తమ దగ్గర ఉన్న వ్యాక్సిన్లు, వాటి ధరలను ముందుగానే ప్రకటిస్తారు. దాన్ని బట్టి ఏ వ్యాక్సిన్ కావాలో ఎంచుకునే అవకాశం దక్కుతుంది అని శర్మ చెప్పారు.
CoWin యాప్ ప్రైవేట్ సెంటర్లలోని వ్యాక్సిన్లు, వాటి ధరలను చూపెడుతుందని ఆయన స్పష్టం చేశారు. మే 1 నుంచి వ్యాక్సిన్ తయారీదారులు 50 శాతం కేంద్రానికి, మిగతా 50 శాతాన్ని రాష్ట్రాలు, ప్రైవేట్ సెంటర్లకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. 45 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఎలా కొనసాగుతోందో అలాగే ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం కేంద్రాల్లో వీరికి ఉచితంగా, ప్రైవేట్ కేంద్రాల్లో రూ.250కి వేస్తారు.
అయితే ఇక నుంచి ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసుకునే 18-44 ఏళ్ల వయసు వాళ్లు మాత్రం ఎక్కువ చెల్లించాల్సిందే. ఎందుకంటే కొవిషీల్డ్ను రాష్ట్రాలకు రూ.300, ప్రైవేట్ సెంటర్లకు రూ.600కు అమ్ముతున్నట్లు సీరం చెప్పింది. ఇక కొవాగ్జిన్ను రాష్ట్రాలకు రూ.400, ప్రైవేట్ సెంటర్లకు రూ.1200కు ఇవ్వనున్నట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.