ముంబై : మహారాష్ట్రలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గల్లంతయ్యారు. సుమారు 1,028 గ్రామాల్లో ప్రాణనష్టం సంభవించినట్లు ఆ రాష్ట్ర సహాయ, పునరావాసశాఖ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 2.29 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల ధాటికి 25,564 జంతువులు మృత్యువాతపడ్డాయి. 56 మంది గాయపడ్డారు. 100 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ 259 పునరావాస కేంద్రాల్లో 7,832 మంది ఆశ్రయం పొందుతున్నట్లు వెల్లడించారు. సతారా జిల్లా పఠాన్ తాలూకాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పర్యటించనున్నారు. వరద సహాయక శిబిరాలను ఆయన పరిశీలించి, వరద బాధితులతో మాట్లాడనున్నారు. కొల్హాపూర్ జిల్లాలో 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు 1500 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ తెలిపారు. వరదల ధాటికి ఈ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.