న్యూఢిల్లీ, జూలై 15: 2016-2019 మధ్యకాలంలో దేశంలో రాజద్రోహం కేసులు అంతకుముందుతో పోలిస్తే 160% పెరిగాయని పౌర హక్కుల న్యాయవాది వృందా గ్రోవర్ తెలిపారు. 2019లో నమోదైన రాజద్రోహం కేసుల్లో కేవలం 3.3శాతం కేసుల్లో మాత్రమే దోషులు తేలారని చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డాటాను బట్టి ఈ వివరాలు వెల్లడించారు. రాజద్రోహం కేసులు పెట్టడానికి అవసరమైన పరిస్థితులు లేకపోయినా కేసులు నమోదు చేయడమే నేర నిరూపణ రేటు తక్కువగా ఉండటానికి కారణం అని సీనియర్ న్యాయవాది గీతా లూథ్రా తెలిపారు. ‘ప్రాసిక్యూషన్ చాలా సందర్భాల్లో కనీసం సాక్ష్యాలను కూడా చూపించరు. అభియోగపత్రాలు దాఖలు చేయరు. తాము అనుకొన్నవారిని జైల్లో పెట్టడమే వారి లక్ష్యం. అసమ్మతిని కఠినంగా అణచివేస్తామని మిగిలినవారికి సందేశం పంపడమే వారి ఉద్దేశం’ అని అన్నారు.