న్యూఢిల్లీ : అధికంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ స్ట్రెయిన్లు దేశవ్యాప్తంగా ప్రబలుతున్నా ప్రజలు కొవిడ్-19ను తేలికగా తీసుకుంటున్నారని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మార్గదర్శకాలను ప్రజలు విస్మరిస్తే దేశంలో కొవిడ్- 19 పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరించారు. దేశంలో కొవిడ్-19 కేసులు ఈసారి వేగంగా పెరుగుతున్నాయని, ప్రజల నిర్లక్ష్యంతో వ్యాప్తి ప్రమాదకరంగా విస్తరిస్తోందని అన్నారు. ఫిబ్రవరిలో కేసుల సంఖ్య తగ్గుతున్నప్పుడు వైరస్ బలహీనపడిందని ప్రజలు భావించారని, ఇప్పుడూ ప్రజలు అదే ధోరణిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
బయటకు వెళితే మార్కెట్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్లో జనం కిటకిటలాడుతున్నారని, వీరంతా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారని అన్నారు. గతంలో వ్యాధిగ్రస్తుడు తన చుట్టూ ఉండే వారిలో 30 శాతం మందికి వైరస్ను వ్యాప్తి చేస్తే ఇప్పుడు ఓ వ్యక్తి నుంచి పెద్దసంఖ్యలో ప్రజలకు వైరస్ సంక్రమిస్తోందని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురాకుంటే ఇన్ఫెక్షన్ రేటు బహుముఖమై దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని డాక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. అర్హులందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.