న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంపునకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీకా డోస్ల మధ్య గ్యాప్ పెంచడం ప్రయోజనకరమేనని సీరం సీఈఓ అదర్ పూనావాలా సానుకూలంగా స్పందించగా.. వ్యాక్సిన్ రెండో డోసును 16 వారాలకు పెంచడం వెనుక ఏ శాస్త్రీయ ప్రాతిపదిక ఉన్నదని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య నిర్ణీత విరామ సమయం ఇప్పటివరకు 6 నుంచి 8 వారాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ విరామ కాలాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచారు. అయితే ఇది మంచి నిర్ణయమని సీరం సీఈవో పూనావాలా సమర్థించారు. ఈ నిర్ణయం టీకా సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని, శాస్త్రీయంగానూ ఈ నిర్ణయం సరైందేనని ఆయన చెప్పారు. కొవిషీల్డ్ సహా ఏ వ్యాక్సిన్ అయినా డోస్కు డోస్కు మధ్య 12 వారాల గ్యాప్ ఇవ్వడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా ఇదివరకే చెప్పారు.
లాన్సెట్ మెడికల్ జర్నల్ కూడా టీకా డోస్కు డోస్కు మధ్య ఎక్కువ విరామం సబబేనని అభిప్రాయపడింది. మొదటి డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్కు 12 వారాల గ్యాప్ ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్లు 81 శాతం మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపింది. అదే కేవలం ఆరు వారాల గ్యాప్తో వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తే దాని సమర్థత కేవలం 55 శాతం మేరకే ఉంటుందని వెల్లడించింది.
మరోవైపు యూకే, యూరోప్ దేశాలు ఆస్ట్రాజెనెకా రెండో డోస్కు గరిష్టంగా 12 వారాల గ్యాప్ మాత్రమే పాటిస్తుంటే భారత్ ఇలా 16 వారాలకు దాన్ని పొడగించడం చర్చనీయాంశంగా మారింది. రెండో డోస్కు గ్యాప్ ఎక్కువగా ఉండటంవల్ల టీకా సామర్థ్యం పెరుగుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత నెలకొన్న కారణంగానే రెండో డోస్ గ్యాప్ను ఇంతలా పెంచి ఉండవచ్చునని అంటున్నారు.