లేహ్: లడాఖ్లోని లేహ్లో ఇవాళ అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు రెండు వేల ఫీట్ల ఎత్తు ఉన్న పర్వతంపై ఆ జెండాను ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57 ఇంజినీర్ రెజిమెంట్ ఆ పతాకాన్ని కొండ మీదకు మోసుకువెంది. సుమారు 1400 కిలోల బరువు ఉన్న జెండాను 150 మంది సైనికులు మోసుకువెళ్లడం విశేషం. రెండు వేల ఫీట్ల ఎత్తుకు జాతీయ జెండాను మోసుకువెళ్లేందుకు రెండు గంటల సమయం పట్టింది. ఖాదీతో తయారైన ఆ పతాకం సుమారు 225 ఫీట్ల పొడుగు ఉంది. దాని వెడల్పు 150 ఫీట్లు. ఆ జెండా సుమారు 1400 కిలోల బరువు ఉన్నట్లు ఖాది విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. దాదాపు 37,500 చదరపు ఫీట్ల విస్తీరణం ఉన్న ఈ జెండాను తయారు చేసేందుకు 49 రోజులు పట్టిందని ఆయన తెలిపారు.
ఖాదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ మాట్లాడుతూ.. ఐక్యత, మానవత్వానికి మన మువ్వన్నెల జెండా సంకేతంగా నిలుస్తుందని గాంధీ అన్నట్లు తెలిపారు. జెండా గుర్తును ప్రతి ఒక భారతీయుడు ఆమోందించినట్లు ఆయన చెప్పారు. మన దేశ గొప్పతనానికి ఇది సంకేతం అన్నారు. రాబోయే రోజుల్లో ఖాదీ జెండా సైనికులకు ప్రేరణగా నిలుస్తుందని గవర్నర్ మాథుర్ తెలిపారు.