జైపూర్ : కొవిడ్-19 సోకిన శవాన్ని నిబంధనలు పాటించకుండా ఖననం చేసిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో కరోనా వైరస్ కారణంగా నాలుగు మరణాలు మాత్రమే సంభవించినట్లు అధికారులు తెలిపారు. మిగతావారు వయోభారం కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు.
కొవిడ్తో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని ఏప్రిల్ 21న గ్రామానికి తీసుకువచ్చారు. అంత్యక్రియల్లో సుమారు 150 మంది పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా మృతదేహాన్ని ఖననం చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో నుంచి బయటకు తీసినట్లు, ఖననం చేసే సమయంలో చాలా మంది దానిని తాకినట్లు స్థానికులు తెలిపారు.
మొత్తం 21 మరణాలలో కేవలం ముగ్గురు లేదా నలుగురు మాత్రమే కొవిడ్-19తో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు ఉన్నారు. కొవిడ్-19తోనే మరణించారా? లేదా అని తెలుసుకునేందుకు తాము 147 కుటుంబాల నుండి శాంపిల్స్ను సేకరించినట్లు అధికారులు తెలిపారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో శానిటైజేషన్ డ్రైవ్ను చేపట్టినట్లు వెల్లడించారు. అదేవిధంగా సమస్య తీవ్రతను గురించి గ్రామస్థులకు వివరించడం జరిగిందన్నారు.