రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత సుమారు 15 మంది జవాన్లు కనిపించకుండా పోయారని ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు తెలిపాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల హోరాహోరీ తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది.
ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, ఇద్దరు మృతదేహాలు లభించాయని వెల్లడించారు. గాయపడినవారిలో 23 మంది జవాన్లను జీజాపూర్ దవాఖానకు, మరో ఏడుగురిని రాయ్పూర్ హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. సుమారు 15 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం డీఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్లో సుమారు 2 వేల మంది జవాన్లు పాల్గొన్నారు. బృందాలుగా విడిపోయి మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సిల్గేరీ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్లో ఉన్న జవాన్లపై మావోయిస్టుల గెరిల్లాసైన్యానికి (పీఎల్జీఏ) చెందిన నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో డీఆర్జీకి చెందిన నలుగురు జవాన్లు, కోబ్రా బెటాలియన్కి చెందిన ఒక జవాన్ మృతిచెందారు. అయితే కాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో గాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..