న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని ఔరారియా జిల్లాలో విషాద ఘటన జరిగింది. యమునా నదిలో స్నానానికి వెళ్లి ప్రవాహ ఉధృతిలో నలుగురు బాలికలు గల్లంతయ్యారు. అయనా పోలీసు సర్కిల్ పరిధిలోని ఫరిహ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు ఇప్పటికే లభించగా మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదుగురు బాలికలు కలిసి నదిలో స్నానానికి వెళ్లగా ప్రవాహ వేగానికి నలుగురు కొట్టుకుపోయారు. ప్రియాంక అనే బాలిక సురక్షితంగా బయటపడి విషయాన్ని గామస్తులకు తెలిపింది. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరి మృతదేహాలను గుర్తించి వెలికితీయించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, నదీ దిగువ ప్రాంత పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామని అజిత్మల్ సీఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.