మనోహరాబాద్, జూన్ 23 : పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మెదక్ కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో బుధవారం పర్యటించారు. పెండింగ్లో ఉన్న పనులను పరిశీలించారు. వారం క్రితం గ్రామంలో పర్యటించిన ఆయన పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. అయినప్పటికీ పనులు నెమ్మదిగా నడస్తుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలు శాఖల అధికారులతో తహసీల్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పనుల వివరాలను సేకరించారు. పను ల్లో జాప్యం జరిగితే సహించేది లేదన్నారు. హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జిల్లాల్లో హరితహారం కార్యక్రమాన్ని సం బంధించిన ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. మొక్కలు నాటడానికి ఖాళీ స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. 35 లక్షల మొక్కలను నాటే లక్ష్యం ఉండగా, ఆయా నర్సరీల్లో 53 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జాతీయ రహదారి వెంబడి 17 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, సర్పంచ్లు నర్సయ్య, ప్రభావతి పెంటయ్య, కో ఆప్షన్ మెంబర్ జావిద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.