“ రెండో దశలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనాపై యుద్ధానికి ఎవరికి వారుగా సిద్ధం కావాలి. కరోనా ప్రారంభంలో అప్రమత్తంగా ఉండి.. వ్యాప్తి తగ్గగానే ఇంకేమీ కాదు అన్నట్లు చాలా మంది నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనకు ఉన్న ఆయుధాలు వ్యాక్సిన్, మాస్కే. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ ధరించడం, ఇతర జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. గతంలో ఒకరికి పాజిటివ్ వస్తే వారి క్లోజ్ కాంటాక్ట్స్ పది మందిలో ఇద్దరికే సోకగా.. రెండో దశలో మాత్రం ఏడుగురికి సోకుతుంది.” అని ఉస్మానియా దవాఖాన జనరల్ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సిన్ తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాజిటివ్ వచ్చిన వారికి అందించే వైద్యం, కోలుకున్న తర్వాత తలెత్తే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలపై ‘నమస్తే తెలంగాణ’కు ఆమె ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు?
గాలి నుంచి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఇంకా అది నిరూపితం కాలేదు. దీంతో విధిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండాలి. అవకాశం ఉన్న వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. లక్షణాలు కనిపించగానే స్వీయ నిర్బంధం పాటించాలి. తప్పని సరిగా పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు ఉండి ఆక్సిజన్ లెవల్స్ 94 శాతం కన్నా తక్కువుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
పాజిటివ్ వస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా?
చికిత్స ఆలస్యమైతే ఊపిరితిత్తులు కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరాలి. ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. స్పేరోమీటర్తో ఊపిరితిత్తుల వ్యాయామం చేస్తే కొంత ఉపశమనం పొందవచ్చు. కొవిడ్ నుంచి కోలుకున్నాక కొందరికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీన్ని పెంచుకునేందుకు పోషకాహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మొదటి, రెండో దశలో వైరస్ లక్షణాలు.. చికిత్సలో వ్యత్యాసాలు ఉన్నాయా?
మొదటి దశ కన్నా రెండో దశలో వైరస్ వ్యాప్తి పది రెట్లు ఎక్కువగా ఉంది. తీవ్రత మాత్రం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. లక్షణాల్లోనూ మార్పులున్నాయి. కేవలం నీరసం, తలనొప్పి, ఒంటినొప్పులు, విరేచనాలు, దగ్గు, జలుబు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఒక్క రోజులోనే శ్వాస తీసుకోకపోవడం, గుండెపోటు, రక్తం గడ్డకట్టడం లాంటి లక్షణాలతో చాలా మంది రోగులు వస్తున్నారు. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది క్షేమంగానే బయటపడుతున్నారు. చికిత్సలోనూ అనేక మార్పులొచ్చాయి. శ్వాసతో ఇబ్బంది పడే వారికి ఆక్సిజన్ అందించడంతో పాటు స్టెరాయిడ్స్, రక్తం గడ్డకట్టకుండా మందులు ఇస్తున్నారు.
వైరస్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
మనలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయాయం, సరైన నిద్ర, పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనం సాగించాలి. అప్పుడే వైరస్ను ఎదుర్కోవచ్చు.
మూడో దశ వచ్చే అవకాశం ఉందా? ఓ వేళ వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది?
మూడో దశపై ఇప్పుడే చెప్పడం కష్టం. రెండో దశ తగ్గే వరకు ఎంత శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోగలం.. హెర్డ్ ఇమ్యూనిటీ ఎంత వరకు వస్తుందనే దానిపై మూడో దశ ఆధార పడి ఉంటుంది. ప్రజలందరూ భయం వీడి.. బాధ్యత విస్మరించకుండా జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారి నుంచి క్షేమంగా బయటపడగలం.
వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఏమిటి ? ప్రజల్లో ఉన్న అపోహలకు మీరిచ్చే సూచనలు?
ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఆయుధం వ్యాక్సిన్. దీంతో తీవ్రమైన కేసులు తగ్గిపోతున్నాయి. వ్యాక్సిన్ వచ్చిన మొదట్లో వైద్యులు కూడా అపోహపడ్డారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించారు. జీహెచ్ఎంసీ, ఇతర విభాగాల్లోని సిబ్బంది కూడా వ్యాక్సిన్ తీసుకుంటే రెండు రోజుల పాటు ఆల్కహాల్కు దూరంగా ఉండాలన్న ప్రచారాన్ని నమ్మారు. ఈ అపోహలను అందరూ వీడాలి. వ్యాక్సిన్ వేసుకోవడం పూర్తి క్షేమం.. లాభదాయకం కూడా. కొంతమందిలో ఒంటినొప్పులు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా కరోనాతో పోలిస్తే పెద్ద ముప్పేమీ కాదు.
కరోనా వ్యాక్సిన్ మనిషి శరీరంపై చూపే ప్రభావం, అది వైరస్ను ఎలా ఎదుర్కొంటుంది?
రెండు డోస్లు తీసుకున్న తర్వాతే వైరస్ను ఎదుర్కొనేందుకు మన శరీరం సంసిద్ధమవుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 0.04 శాతం మందికి మాత్రమే వైరస్ సోకినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తెల్లరక్త కణాలను ఉత్తేజపరిచి, యాంటీబాడీస్ను తయారు చేస్తుంది. శరీరంలోకి వైరస్ చేరగానే అది పోరాడి చంపేస్తాయి. ఒక వేళ యాంటీబాడీస్ తగ్గినా వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తంలోని టీ సెల్స్ వైరస్తో యుద్ధం చేసే సామర్థ్యాన్ని పొందుతాయి. అయితే ఈ సామర్థ్యం ఎంతకాలం ఉంటుందన్న విషయమై ప్రస్తుతం పరిశోధనలు సాగుతున్నాయి.
రెండో దశ వ్యాప్తి ఎలా ఉంది, ప్రజలు ఎలా అప్రమత్తం కావాలి?
మొదటి దశకన్నా.. రెండో దశలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. వ్యక్తిగతంగా ఎవరికి వారుగా జాగ్రత్త పడాలి. వ్యాక్సిన్ వేసుకున్నా భౌతికదూరం పాటించడం.. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం.. మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. తొలిదశలో తీసుకున్న జాగ్రత్తలను అలాగే కొనసాగిస్తే రెండోదశలో వైరస్ ప్రభావం ఇంత తీవ్రంగా ఉండేది కాదు. మహమ్మారిని ఎదుర్కొవాలంటే వ్యాక్సిన్ వేసుకోవడం.. మాస్క్ ధరించడం ఉత్తమం. రెండో దశలో వైరస్ లక్షణాల్లో చాలా తేడాలున్నాయి. యువతపై వైరస్ ప్రతాపం చూపుతున్నది. ఒకరికి పాజిటివ్ వస్తే క్లోజ్ కాంటాక్ట్స్లోని పది మందిలో ఏడుగురికి వైరస్ అంటుతుంది.