లక్నో : ఉన్నతాధికారుల మానసిక వేధింపులు, దుష్ప్రవర్తన కారణంగా 14 మంది ప్రభుత్వ వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం సీఎంవో కార్యాలయంలో తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అదేవిధంగా తమ రాజీనామా లేఖల కాపీని అదనపు చీఫ్ సెక్రటరీ (హెల్త్), డైరెక్టర్ జనరల్ (హెల్త్), ఇతర సీనియర్ అధికారులకు పంపించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో చోటుచేసుకుంది. అయితే రాజీనామాలపై జిల్లా మేజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్తో చర్చలు జరిగే వరకు తమ కొవిడ్ సంబంధిత పనులను ప్రభావితం చేయబోమని వైద్యులు హామీ ఇచ్చారు. వీరంతా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు.
గత ఏడాది కాలంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత వనరులతో పనిచేస్తున్నా కూడా డీఎం, సీఎంవో తమపట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. తమకు సహకరించడానికి బదులుగా తమతో తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపించారు. తమ జీతాలను సైతం ఎన్నోసార్లు నిలిపివేసినట్లు చెప్పారు.
కాగా ఈ ఆరోపణలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) అశుతోష్ కుమార్ ఖండించారు. తాము అలా ప్రవర్తించమన్నారు. తామంతా కలిసి పనిచేస్తామన్నారు. సీఎంవో, జిల్లా మేజిస్ట్రేట్ను కలిసిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బాధిత వైద్యులు తెలిపారు.