న్యూఢిల్లీ, మే 21: ఆర్టీపీసీఆర్ టెస్టులపై కేంద్రం యూ టర్న్ తీసుకొందా.. మొత్తం పరీక్షల్లో 70% ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉండాలని ఏప్రిల్లో ప్రధాని మోదీ రాష్ర్టాలకు చేసిన సూచనకు, కరోనా పరీక్షలపై కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన మార్గదర్శకాలకు మధ్య తేడా దీన్నే సూచిస్తున్నది. జూన్ చివరికి రోజువారీ టెస్టుల సంఖ్యను 45 లక్షలకు పెంచుతామని చెప్పిన కేంద్రం యాంటీజెన్ టెస్టులను గణనీయంగా పెంచుతామని పేర్కొంది. మరోవైపు వారం రోజులుగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య తగ్గుతున్నది. గతంలో రోజుకు 16 లక్షల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఇప్పుడు అది 13 లక్షలకు పడిపోయింది. గురువారం 20.55 లక్షల పరీక్షలు చేస్తే అందులో ఆర్టీపీసీఆర్ టెస్టులు 10.6 లక్షలు ఉన్నాయి. ఇది మొత్తం టెస్టుల్లో 50 శాతం మాత్రమే. జూన్ చివరికి 45 లక్షల టెస్టుల లక్ష్యంతో యాంటీజెన్ పరీక్షలు పెంచితే ఆర్టీపీసీఆర్ వాటా 40 శాతానికి పడిపోతుంది. ఇది ప్రధాని సూచించిన సంఖ్యతో పోల్చితే చాలా తక్కువ. అయితే రోగులను త్వరగా గుర్తించి కరోనాను సాధ్యమైనంత వేగంగా కట్టడి చేయడం కోసమే యాంటీజెన్ పరీక్షలను పెంచుతున్నట్టు కేంద్రం చెప్తున్నది. మొత్తం పరీక్షలను ఆర్టీపీసీఆర్ విధానంలో చేస్తే రోజువారీ కేసులు సగటున 75-80 వేలు అధికంగా నమోదు కావచ్చని అంచనా.