చెన్నై: ఏడేండ్ల బాలుడ్ని ముగ్గురు మహిళలు కొట్టి చంపారు. తమిళనాడులోని కన్నమంగళంలో ఈ దారుణం జరిగింది. ఒక బాలుడ్ని తల్లితో పాటు మరో ఇద్దరు మహిళలు పైశాచికంగా కొట్టడాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి రాగా బాలుడు అచేతనంగా పడి ఉన్నాడు. తాము రాక ముందే ఆ బాలుడు చనిపోయినట్లు పోలీసులు గ్రహించారు. పోస్ట్మార్టం కోసం బాలుడి మృతదేహాన్ని వెల్లూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి తిలగవతి, ఆమె సోదరీమణులు కవిత, బక్యలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తన కుమారుడి రోగం నయం కోసం మంత్రగాడి వద్దకు వెళ్తుండగా ఫిట్స్ వచ్చి చనిపోయాడని తల్లి తిలగవతి పోలీసులకు చెప్పింది. అయితే ఆ ముగ్గురు మహిళలు బాలుడ్ని దారుణంగా కొట్టడాన్ని తాము చూసి పోలీసులకు సమాచారం ఇచ్చామని కొందరు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.