మాడ్గులపల్లి, మార్చి 30 : తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం మాడ్గులపల్లి మండలంలోని అభంగాపురం, పూసలపహాడ్, గజలాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 40 ఏండ్లు నియోజకవర్గాన్ని శాసించిన జానారెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కనీసం సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మొట్టమొదటి మేజర్ అయిన రాజవరం భూములకు సైతం సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రచారం వద్దు.. ఆర్భాటాలు వద్దు అంటూ జానారెడ్డి మాట్లాడుతున్న మాటలు ఓటమిని అంగీకరిస్తున్నట్లుగానే ఉన్నాయన్నారు. 2018 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని ఓడించి బుద్ధి చెప్పారని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు ఆయనకు లేదని తెలిపారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాల్లో అగ్రస్థానంలో ఉందని, సాగర్లోనూ అభివృద్ధి అంటే ఏంటో టీఆర్ఎస్ పాలనలోనే ప్రజలు రుచి చూశారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు వంటి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలకు తీరని భారం మోపుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చి ఉచిత కరెంటుతోపాటు, ప్రాజెక్టులు చేపట్టి సాగునీటిని అందిస్తున్నారని తెలిపారు. యువకుడు, విద్యావంతుడు అయిన భగత్ను కేసీఆర్ దీవించి పంపించారని, ఆయన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
హామీలు నెరవేరాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలి : మంత్రి తలసాని
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం ఇంకా ప్రగతి సాధిస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణం బాధాకరమని, నర్సింహయ్య నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఉప ఎన్నికల్లో నోముల భగత్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
మరింత అభివృద్ధికి అవకాశం ఇవ్వండి :నోముల భగత్
నియోజకవర్గం మరింత అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కోరారు. తమ తండ్రి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చారని, ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, తనకు మద్దతుగా నిలిచిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు భగత్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం : ఎమ్మెల్యే జీవన్రెడ్డి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఇంటికొకరు చొప్పున ప్రభుత్వ పథకాలను పొందుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. నోములనర్సింహయ్య అకాల మరణం తీరని లోటని, తెలంగాణ వచ్చిన తర్వాతనే వరద కాల్వకు నీళ్లు వచ్చాయని తెలిపారు. వరద కాల్వ ద్వారా అభంగాపురం, పూసలపహాడ్, గజలాపురం గ్రామాలు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మిర్యాలగూడ, నకిరేకల్ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం
మాడ్గులపల్లి మండలం అభంగాపురం నుంచి భగత్ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారాన్ని ప్రారంభించారు. నోముల నర్సింహయ్య కూడా ఇక్కడి నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించడంతో అదే ఆనవాయితీని కుమారుడు భగత్ కొనసాగిస్తూ స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీలు పల్లా, తేరా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు వెంట రాగా భగత్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అభంగాపురంలో ప్రజలు పెద్దఎత్తున కోలాటాలు, నృత్య ప్రదర్శనలతో ప్రచారానికి స్వాగతం పలికి ఊర్లోకి తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత పూసలపహాడ్, గజలాపురంలోనూ ప్రచారం కొనసాగింది. తొలి రోజు ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ లభించింది.