చమోలీ : ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీన అకస్మాత్తుగా భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడం వల్ల వచ్చిన ఆ ఉప్పెనలో సుమారు 200 మంది మరణించారు. ఆ ఘటనపై అధ్యయనం చేసిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఓ నివేదికను రిలీజ్ చేసింది. సుమారు 27 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాతి కొండ కూలడంతో పాటు సమీపంలోని రోంటి శిఖరం మీదున్న మంచుగడ్డలు కొట్టుకురావడంతో ఆ పెను విపత్తు జరిగినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రోంటి, రిషిగంగా, దౌలీగంగా నదీ లోయల్లో ఉగ్ర స్థాయిలో ఆ రోజున నీరు ప్రవహించింది. చమోలీ విషాద ఘటనను సుమారు 53 మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఢిల్లీలోని జేఎన్టీయూ, ఇండోర్లోని ఐఐటీ పరిశోధకులు కూడా దీంట్లో ఉన్నారు.
ఒకేసారి కొండ రాళ్లు, గ్లేసియర్ మీదున్న మంచుగడ్డ.. లోయలో పడిపోవడం వల్ల అత్యంత భయానకమైన ఉప్పెన వచ్చినట్లు తేల్చారు. జర్నల్ సైన్స్లో దీనికి సంబంధించిన నివేదికను పబ్లిష్ చేశారు. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వారన్నారు. ఇలాంటి ప్రదేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడితే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నారు. నది ప్రవాహంలో 20 మీటర్ల వెడల్పు ఉన్న రాళ్లు కొట్టుకువచ్చాయని, నీటి ప్రవాహం కూడా 220 మీటర్ల ఎత్తులో ప్రవహించినట్లు పరిశోధకులు చెప్పారు. శాటిలైజ్ చిత్రాలు, సెసిమిక్ రికార్డులు, ప్రత్యక్ష సాక్షులు సమర్పించిన వీడియోల ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రమాదం జరిగిన చోటు మంచు సరస్సులు లేవని తెలిపారు. హై రెజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు, రీసర్చ్ సాఫ్ట్వేర్, శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ పద్ధతుల ద్వారా అంచనా వేసినట్లు వాషింగ్టన్ వర్సిటీ విద్యార్థి శశాంక్ భూషణ్ తెలిపారు.