న్యూఢిల్లీ : కరోనా వైరస్ భారత్ వేరియంట్ అని ఉటంకిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాషాయ నేతలు మండిపడుతున్నారు. భారత కరోనా అని మహమ్మారిని పిలుస్తూ కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇతర కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ వేరియంట్ కూ ఏ దేశం పేరునూ ఆపాదించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దేశానికి అవమానకరమే కాకుండా కరోనా వైరస్ వ్యతిరేక పోరాటాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన కొవ్యాక్సిన్ ను బీజేపీ వ్యాక్సిన్ గా కాంగ్రెస్ పార్టీ పిలవడాన్ని కేంద్ర మంత్రి తప్పుపట్టారు. కాగా చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత వేరియంట్ తో దేశాన్ని సెకండ్ వేవ్ తో వణికిస్తోందని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. ఇండియన్ వేరియంట్ పట్ల రాష్ట్రపతి, ప్రధాని బెంబేలెత్తుతున్నారని అన్నారు.