న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని కుదిపేసింది. వైరస్ ధాటికి జనం అతలాకుతలం అయ్యారు. మహమ్మారి విలయం సృష్టిస్తున్న వేళ.. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొన్ని కొన్ని రాష్ట్రాలు కొన్ని కొన్ని పద్దతులను అవలంబించాయి. ఉత్తమోత్తమ విధానాలతో ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశాయి. తమిళనాడులోని ట్యాక్సీ అంబులెన్సులు.. రాజస్థాన్లోని మొబైల్ ఓపీడీ సేవలు.. కేరళలో ఆక్సిజన్ నర్సులు .. ఇలా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం .. ఒక్కొక్క విధంగా మహహ్మారిని నిలువరించేందుకు ప్రయత్నించాయి. అయితే ఉత్తమ విధానాలు అవలంబించిన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ప్రశంసించింది. కోవిడ్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం చేపట్టిన పనితీరును ప్రధాని మోదీ మెచ్చుకున్నట్లు ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
తమిళనాడులో కోవిడ్ రోగులను హాస్పిటళ్లకు చేర్చేందుకు ట్యాక్సీ అంబులెన్సులను స్టార్ట్ చేశారు. లాక్డౌన్ వల్ల ఖాళీగా ఉన్న ట్యాక్సీలను స్థానిక ప్రభుత్వం.. వాటిని అంబులెన్సులుగా మార్చి .. కోవిడ్ వల్ల కలిగే నష్టాన్ని ఆపే ప్రయత్నం చేసింది. చెన్నైలో ట్యాక్సీ అంబులెన్సులు పెద్ద హిట్ అయ్యాయి. ఇక రాజస్థాన్లో అక్కడ ప్రభుత్వం చేపట్టిన మొబైల్ ఓపీడీ సేవలు అద్భుతం. గ్రామగ్రామానికి వెళ్లి నాన్ కోవిడ్ రోగులకు సేవలు అందించిన తీరు ప్రశంసనీయం. బికనీర్లో ఆక్సిజన్ వృద్ధాను ఆపేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మిత్ర విధానం కూడా ఎంతో బాగున్నట్లు కేంద్రం తన లేఖలో చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీలో ఇంటింట పరీక్షలు చేపట్టారు. ఆర్ఏటీ,ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా.. అక్కడ పాజిటివిటీ రేటును 38 శాతం నుంచి 2.8 శాతానికి కేవలం నెలరోజుల్లో తీసుకురావడం అమోఘమని కేంద్రం తన లేఖలో తెలిపింది.
ఆక్సిజన్ వినియోగంపై కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ నర్సుల విధానం కూడా అద్భుతమని కేంద్రం పేర్కొన్నది. ఆక్సిజన్ కొరత రాకుండా.. అనవసరంగా ఆక్సిజన్ వినియోగం పెంచకుండా ఉండేందుకు ఆక్సిజన్ నర్సులు ఉపయోగపడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద వర్క్సైట్ సెంట్లు, వారాణిసిలో కోవిడ్ సంబంధిత అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన కాశీ కోవిడ్ రెస్పాన్స్ సెంటర్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు పొందాయి.
యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్లో రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాలతో కోవిడ్, ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం.. మధ్యప్రదేశ్లో గత ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థుల్లో తమ తమ గ్రామాల్లో, వాడల్లో కోవిడ్ ఐసోలేషన్, కన్టేన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం.. గురుగ్రామ్లో బెడ్ ఆక్యుపెన్సీ ట్రాకింగ్ కోసం 102 హాస్పిటళ్లలో డిజిటల్ పోర్టల్, అంబులెన్సుల లభ్యత గురించి తీసుకున్న చర్యలు అసాధారణని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది. చండీఘడ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కోవిడ్ మందులు పంపిణీ చేసిన ఆయుష్ మంత్రిత్వశాఖను కూడా కేంద్రం ప్రశంసించింది.