ఇండోర్, జూన్ 6: మామిడి పండ్లు కిలోకు 50 రూపాయలు ఉంటాయి. కానీ మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ అనే ప్రత్యేక మామిడి పండు ఒక్కొక్కదానికే రూ.500-రూ.1000 ధర పలుకుతున్నది. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగా వచ్చినట్టు, కాయ పెద్దగా పెరిగినట్టు అక్కడి రైతులు చెప్తున్నారు. ‘మా తోటలో మూడు చెట్లు ఉన్నాయి. 250 కాయలు కాశాయి. కాయలన్నీ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. ఒక్కో కాయకు రూ.500-రూ.1000 వచ్చింది’ అని రైతు శివరాజ్సింగ్ జాదవ్ చెప్పారు. ఒక్కో కాయ 2 నుంచి 3.5 కిలోల వరకు ఉందన్నారు. నూర్జహాన్ మామిడి అఫ్ఘానిస్థాన్కు చెందినదని, ఇది కేవలం కథివాడా ప్రాంతంలోనే పండుతుందని స్థానికులు తెలిపారు.