కరోనా మహమ్మారి బారి నుంచి సినీ పరిశ్రమను కాపాడుకోవాలని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. సినీ కార్మికులంతా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా వాక్సినేషన్ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు చిరంజీవి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నలభైఐదేళ్లు దాటిన వాళ్లకు కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు అపోలో ఆసుపత్రి సౌజన్యంతో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ఒక కార్యక్రమం తలపెట్టింది. రాబోయే గురువారం నుంచి నెలరోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టబోతున్నాం. నలభై ఐదేళ్లు దాటిన తెలుగు సినీ కార్మికులు, సినిమా జర్నలిస్టులు తమ అసోసియేషన్స్, యూనియన్స్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం పేర్లు నమోదు చేసుకోవాలి. సినీ కార్మికులతో పాటు వారి జీవితభాగస్వాములకు వ్యాక్సినేషన్ను ఉచితంగా అందించబోతున్నాం. షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కొందరికి అపోలో హాస్పిటల్లో తగిన వసతులతో వ్యాక్సిన్ అందిస్తాం. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మెడిసిన్స్ రాయితీ ద్వారా అందించబోతున్నాం. మూడు నెలల పాటు ఉచితంగా డాక్టర్లను సంప్రదించవచ్చు’ అని తెలిపారు.