చిక్కడపల్లి, జూన్ 20: ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రెండో అతిపెద్ద పార్కుగా గుర్తింపు ఉన్న బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కును లక్షలాది రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగా పార్కులో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఎవరికీ అనుమతి లేకపోవడంతో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. సాధన సమయంలో ప్రతి నిత్యం వేలాది మంది పార్కును సందర్శించడానికి సేద తీరడానికి వస్తుంటారు. పార్కు అభివృద్ధిలో భాగంగా రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్థానిక కార్పొరేటర్తో కలిసి రూ. 8 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
వాకర్స్ కోరిక మేరకు ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆట పరికరాలు పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పార్కులో ఇప్పటికే వాకింగ్ ట్రాక్ కర్బింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
సాధారణ సమయంలో వేలాది మందికి ఆహ్లాదాన్ని అందిస్తున్న సుందరయ్య పార్కు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. రూ. 8లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. అదే విధంగా పార్కులో ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. పార్కులో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. లాక్డౌన్ కావడంతో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. – సత్యతేజ,
హార్టికల్చర్ సికింద్రాబాద్ జోన్ మేనేజర్