మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్
నర్సంపేట, జూన్ 9: పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా బుధవారం పట్టణంలో సూపర్స్ప్రెడర్లకు సిటిజన్స్ క్లబ్ ఆవరణలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. రజనీకిషన్ మాట్లాడుతూ హైరిస్క్ ఉన్న వ్యక్తులు, చిరు వ్యాపారులు, వంటగ్యాస్, ఆటో కార్మికులు, హోటల్, సెలూన్, ఇస్త్రీ షాపుల్లోని కార్మికులు, చికెన్, మటన్షాపుల వారు కరోనా నివారణకు టీకాలను వేసుకోవాలని కోరారు. వీరుకేంద్రానికి వచ్చి టీకాలను వేసుకోవాలని తెలిపారు. కరోనా నియంత్రణకు వైద్యుల సూచనలు పాటించాలని, స్వీయనియంత్రణతో వ్యవహరించాలని ఆమె కోరారు. సిటిజన్ క్లబ్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ మోహన్రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, కౌన్సిల ర్లు, అధికారులు పాల్గొన్నారు.