కోల్కతా: ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంజినీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారు. దేశంలో నిరుద్యోగ పరిస్థితికి ఇది అద్దం పడుతున్నది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రభుత్వ నిల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగం ఇటీవల ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. మార్చురీలో ఆరు ల్యాబ్ సహాయకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. మృతదేహాలను ఫ్రీజర్ నుంచి తరలించడం, పోస్ట్మార్టం కోసం వైద్యులకు సహాయంగా ఉండటం వంటి పనుల కోసం ఉద్దేశించిన ఈ ఉద్యోగ ప్రకటనకు అర్హత 8వ తరగతి పాస్, 18-40 ఏండ్ల వయసు. జీతం రూ.15,000.
కాగా, ఈ ఉద్యోగానికి 8 వేల మంది దరఖాస్తు చేశారు. చిన్న పోస్ట్కు వంద మంది ఇంజినీర్లు, 500 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 2,200 మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేయడం చూసి ఆసుపత్రి అధికారులు షాక్ అయ్యారు. ఉన్నత విద్యావంతులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం ఇదే తొలిసారి అని వారు చెప్పారు. సాధారణంగా ఇండ్లలో పని చేసే వ్యక్తులు ఈ ఉద్యోగానికి అప్లై చేస్తుంటారని అన్నారు. మొత్తం అప్లికేషన్లలో 84 మంది మహిళలతో సహా 784 మందిని ఆగస్ట్ 1న నిర్వహించే రాత పరీక్షకు పిలిచినట్లు ఆసుపత్రి అధికారి వెల్లడించారు.