ఉపాధి పనులకు సంబంధించి వర్క్ఫైల్ చేయాలని ప్రభుత్వం ఆదేశం
నాణ్యత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి
సాంకేతిక సహాయకులదే బాధ్యత
దండేపల్లి, మే 6 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పనుల ఫొటోలు తీసి వర్క్ ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి గతంలో మాదిరిగా చేయని పనులు చేసినట్లుగా తప్పుడు నమోదుకు అవకాశం ఉండదు. పని ప్రారంభించడానికి ముందు ఆ ప్రదేశానికి సంబంధించిన ఫొటో, పని జరుగుతున్న సమయంలో ఒక ఫొటో, పని పూర్తయ్యాక మరో ఫొటో తీసి వర్క్ ఫైల్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఉపాధి పనుల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పడనుంది. గతంలో ఇలాంటి ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించేవారు. ఇక నుంచి మాత్రం తప్పనిసరిగా ఫొటోలు అప్లోడ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
పనులపై ప్రత్యేక దృష్టి..
మండల స్థాయిలో ఎంపీడీవో, ఏపీవో, ఈసీలు, పంచాయతీ కార్యదర్శులు, శ్రమశక్తి సంఘాలు, మేట్లు ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్నారు. పనుల్లో జరుగుతున్న అక్రమాలు సామాజిక తనిఖీల్లో వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంతో ఏ గ్రామంలో, ఎక్కడ, ఎంత మంది కూలీలు, ఏయే పనులు చేస్తున్నారన్న విషయం తెలియనుంది.
సాంకేతిక సహాయకులదే బాధ్యత..
గతంలో పనులను గ్రామ స్థాయిలో ఉండే క్షేత్ర సహాయకులు పర్యవేక్షించేవారు. వారిని ప్రభుత్వం తొలగించడంతో ప్రస్తుతం సాంకేతిక సహాయకుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు గ్రూపులుగా విడిపోయి చేస్తుంటారు. ఇదే రోజు అన్ని గ్రూపుల వద్దకు వెళ్లి వర్క్ ఫైల్ చేయాల్సిన బాధ్యత టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించారు. జిల్లాలోని 311 జీపీలకు గాను 59 మంది టెక్నికల్ అసిస్టెంట్లున్నారు.
32 రకాల పనులు..
ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతలు, వంటగది ని ర్మాణాలు, పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణాలు, డంప్ యా ర్డు షెడ్లు, చెరువుల్లో పూడికతీత, కాల్వలు, ముల్ల పొదల తొలగింపు, ఫీడర్ చానల్, బావుల్లో పూడికతీత, శ్మశానవాటికల నిర్మాణాలు, నర్సరీలు, పశువుల పాకల నిర్మాణాలు, నీటితొట్ల నిర్మాణాలు, ఆటస్థలాల చదును, పశుగ్రాసం పెంపకం, గొర్రెల షెడ్లు, ఫీల్డ్ చానల్, భూమి లెవలింగ్, తదితర పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఫొటోలు తప్పనిసరి..
ఉపాధి పనులకు సంబంధించి మూడురకాల ఫొటోలు తీసుకొని వర్క్ఫైల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయిస్తున్నాం. దీంతో పనుల్లో జాప్యం జరుగదు. సామాజిక తనిఖీలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి పని ఏ దశలో ఉందో తెలిసిపోతుంది. పనులు నాణ్యత, పారదర్శకంగా అవుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ కూలీలు ఉపాధి పనులకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలి.