న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ వైరస్ పాజిటివిటీ రేటు 14.10 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. మే 3వ తేదీన రికవరీ రేటు 81.7 శాతం ఉందని, అయితే ఆ రేటు ఇప్పుడు 85.6 శాతానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 4,22,436 మంది కోలుకున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో ఇంత భారీ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి. అంటే కోవిడ్ రికవరీ కేసుల్లో పాజిటివ్ ట్రెండ్ మొదలైనట్లు లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. కొత్త కేసుల కన్నా రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, 50 వేల నుంచి లక్ష మధ్య పది రాష్ట్రాలు, ఇక 50 వేల కన్నా లోపు యాక్టివ్ కేసుల్లో 18 రాష్ట్రాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి శుక్లా తెలిపారు. 199 జిల్లాల్లో వైరస్ పాజిటివ్ కేసుల తరుగుదల కనిపించిందని, గత మూడు వారాల నుంచి పాజిటివ్ రేటు కూడా తగ్గిందన్నారు. ఇప్పటివరకు కోవిడ్ వ్యాధి దేశ జనాభాలో 1.8 శాతం మందికి వచ్చిందని, వైరస్ వ్యాప్తిని రెండు శాతం లోపు నియంత్రించినట్లు ఆయన తెలిపారు. అమెరికాతో పాటు ఇతర ప్రపంచదేశాల్లో ఎంత శాతం జనాభాకు వైరస్ సంక్రమించిందన్న డేటాను ఆయన ప్రజెంట్ చేశారు.