హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నేత పాడి కౌశిక్రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేవంత్ పీసీసీ చీఫ్లా వ్యవహరించడం లేదని విమర్శించారు. మాణిక్కం ఠాగూర్కు కామన్సెన్స్ లేదంటూ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. మాణిక్కం ఠాగూర్కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ చీఫ్ పదవి పొందారని, ఇది వాస్తవం కాదా? అన్ని ప్రశ్నించారు. ఇన్నెండేళ్ల నుంచి పార్టీలో ఉన్న మేం ఏమై పోవాలని, పీసీసీ పదవి జీవన్రెడ్డికో, జనారెడ్డికో, భట్టివిక్రమార్కకో ఎందుకు ఇవ్వలేదన్నారు. పార్టీ కోసం నేను ఒక్కడినా కొట్లాడాలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీని రేవంత్ ఖతమ్ చేస్తున్నాడని, పార్టీని చంద్రబాబు నాయుడుకు తాకట్టుపెడుతున్నాడని ఆరోపించారు. అపాయింట్మెంట్ ఇవ్వమంటే బిజీగా ఉన్నానని చెబుతున్నాడన్నారు. రేవంత్, ఈటల రాజేందర్కు అమ్ముడుపోయాడన్నారు. ఎన్నికల్లో డిపాజిట్ పోయిన, కనీసం నివాసం ఉంటున్న ఇంటి పరిధిలోని వార్డులో 40 ఓట్లు రాని వ్యక్తి లీడరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ను హుజూరాబాద్లో అభ్యర్థిగా నిలిపి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పొన్నం డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎగిరెగిరి పడ్డారని, ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దామన్నారు.
కాంగ్రెస్ పార్టీని రేవంత్ భ్రష్టు పట్టించాడని, ఆయన తీరుతో రాబోయే ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖతమ్ ఖాళీ అవుతుందన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా గుండెల మీద చేతులు వేసుకొని మాట్లాడాలన్నారు. కోమటిరెడ్డి, రాజగోపాల్రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, కోడం వీరయ్యతో పాటు కాంగ్రెస్లో ఉన్న ఎవరూ సంతోషంగా లేదన్నారు. రేవంత్రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన పార్లమెంట్ పరిధిలోని 48 డివిజన్లలో కాంగ్రెస్కు ఎందుకు డిపాజిట్ రాలేదో చెప్పాలన్నారు. పార్లమెంట్ పరిధిలోనే డిపాజిట్ తేలేనోడు రాష్ట్రంలో ఏదో చేస్తానని చెబుతున్నాడన్నారు.
యుద్ధానికి సై అంటే సై అనేటోడు… రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలని, చేతగానోడు ఎందుకు ప్రెసిడెంట్ గిరి తీసుకోవాలని ప్రశ్నించారు. ఏ పార్టీ అధ్యక్షుడైనా ఎన్నికల్లో ఓడిపోతామని చెబుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతాడని, సినిమాలో ముమైత్ ఖాన్ వస్తే చప్పట్లు, ఈలలు కొడుతారని, కాంగ్రెస్ పార్టీకి మరో ముమైత్ఖాన్ రేవంత్రెడ్డి అన్నారు. పార్టీకే దిక్కు లేదు.. సీఎం సీఎం అంటే సరిపోతుందా? అంటూ మండిపడ్డారు. 119 అసెంబ్లీ స్థానాల్లో ఎవరూ గెలువందే సీఎం అవుతారా? అంటూ ప్రశ్నించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ రేవంత్రెడ్డి తనకు హుజూరాబాద్లో టికెట్ రాకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. 15 రోజుల ముందు అవకాశం ఇస్తే ఈటల రాజేందర్కు చెమటలు పట్టించానని చెప్పాడు. ఈటలకు పొన్నం ప్రభాకర్ ఏజెంట్గా వ్యవహరిస్తాడని, ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతిసారి ఈటల రాజేందర్.. పొన్నం ప్రభాకర్ కోవర్టుగా వ్యవహరిస్తాడన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మండల నాయకులు, గ్రామశాఖల అధ్యక్షులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండరని, రాజీనామా చేస్తారన్నారు.