బెంగళూరు: హిందూ వ్యక్తి బైక్పై ఒక ముస్లిం మహిళ ప్రయాణించడాన్ని గమనించిన కొందరు వారిని అడ్డుకుని వేధింపులకు గురి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన ఒక వ్యక్తి బైక్పై ముస్లిం మతానికి చెందిన ఒక మహిళ ప్రయాణిస్తున్నది. గమనించిన కొందరు ముస్లిం యువకులు ఆ బైక్ను అనుసరించారు. బైక్ను అడ్డుకుని వారిపై వేధింపులకు పాల్పడ్డారు.
బైక్ నడుపుతున్న వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అతడి చెంపపై కొట్టారు. అతడి వెనుక బైక్పై కూర్చొన్న ముస్లిం మహిళతో అసభ్యంగా మాట్లాడారు. ‘పరాయి వ్యక్తితో ప్రయాణించడం సిగ్గుగా లేదా? ఎలాంటి కాలంలో జీవిస్తున్నామో నీకు తెలియదా?’ అంటూ నిందితుల్లో ఒకడు మహిళతో వాదనకు దిగాడు. కాగా, తనకు పెండ్లి అయ్యిందని, ఈ వ్యక్తితో కలిసి తాను బైక్పై వెళ్తున్న సంగతి తన భర్తకు తెలుసని ఆ మహిళ వారితో చెప్పింది. దీంతో ఆమె భర్త ఫోన్ నంబర్ చెప్పాలంటూ, బైక్ దిగాలంటూ నిందితుల్లో ఒకడు ఆమెను ఫోర్స్ చేశాడు. ఆమెను బలవంతంగా బైక్ నుంచి దించి ఆటోలో పంపారు.
మరోవైపు తమ మతం మహిళను బైక్పై తీసుకెళ్లేందుకు ‘ఎంత ధైర్యం’ అంటూ బైక్ నడుపుతున్న వ్యక్తిని దూషించడంతోపాటు అతడిపై దాడి చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తి తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. బెంగళూరులోని డైరీ సర్కిల్ వద్ద జరిగిన ఈ వేధింపుల ఘటనను ధృవీకరించారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
కాగా, ఇలాంటి ఘటనలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆదివారం ట్వీట్ చేశారు. నిందితులను పోలీసులు 12 గంటల్లో గుర్తించి అరెస్ట్ చేశారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.