హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రవాస భారతీయుల ఆలోచనా ధోరణి మారింది. ఇన్నాళ్లూ స్వదేశంలోని ఆస్తులను కేవలం పెట్టుబడిగా మాత్రమే చూసిన ఎన్నారైలకు కరోనా మహమ్మారి కొత్త పాఠం నేర్పింది. పరిస్థితి ఏ క్షణమైనా తలకిందులై స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం రావొచ్చన్నదే ఆ పాఠం. దీంతో చాలా మంది ఎన్నారైలు భారత్లో ఓ సొంతిల్లు ఉండాలని భావిస్తున్నట్టు సీఐఐ-అనరాక్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో
వెల్లడైంది.
విలాసమైన ఇండ్లకే ఓటు
భారత్లో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే ఎన్నారైలు విలాసవంతమైన ఇండ్లవైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 48% మంది 3బీహెచ్కే (కనీసం 1500 చదరపు అడుగులు) వైపు మొగ్గు చూపారు. 4బీహెచ్కే లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్లు కావాలని 24% మంది, 2బీహెచ్కే ఇండ్లను కొనుగోలు చేస్తామని 28% మంది చెప్పారు.
బ్రాండెడ్ డెవలపర్లవైపే మొగ్గు
స్వదేశంలో ఇండ్లను కొనుగోలు చేయాలనుకొంటున్న ఎన్నారైలలో ఎక్కువ మంది నమ్మకమైన, బ్రాండెడ్ డెవలపర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇండ్లకు కావాల్సిన హంగులతోపాటు మంచి ధర, అమ్మిన తర్వాత మంచి సర్వీస్ అందించే సంస్థలతోనే మాట్లాడుతున్నారు. ఇలాంటివారంతా చాలా ఏండ్ల కిందటే విదేశాలకు వెళ్లిపోవడం, భారత్లో రియల్ ఎస్టేట్ మార్కెట్పై పెద్దగా అవగాహన లేకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.