మహారాష్ట్రలో రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం వాడే మందుల కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరక్క కోవిడ్ రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు ఆక్సిజన్ల సిలిండర్లు లేవు. ఇంకోవైపు రెమ్ డిసివిర్ ఇంజక్షన్లు దొరక్కపోవడంతో పూనేలో రోగుల బంధువులు, కుటుం సభ్యులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
కోవిడ్ తో బాధపడుతున్న తన తండ్రి ఆరు రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నా ఇంతవరకుచికిత్స ప్రారంభం కాలేది ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదని తెలిపింది. ఐసీయూలో ఉన్న తన తండ్రిని బతికించుకోవాలంటే రెమ్ డిసివర్ ఇంజక్షన్ అవసరం ఉందంటోంది. వెంటనే ప్రభుత్వం కోవిడ్ ట్రీట్ మెంట్ కి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని రోగుల బంధువులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ కొరత ఉన్నమాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. 45వేల ఇంజక్షన్లు అవసరం ఉన్నా ప్రస్తుతానికి 10వేల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమస్యని ఔషధ కంపెనీల దృష్టికి తీసుకెళ్లామన్నారు. మూడునాలుగు రోజుల్లో రెమ్డెసివర్ ఇంజక్షన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.