కోల్కతా : బెంగాల్ నటి పాయెల్ సర్కార్ గురువారం బీజేపీలో చేరారు. కోల్కతాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బెంగాల్ యూనిట్ చీఫ్ దిలీప్ ఘోష్ సమక్షంలో కాషాయ పార్టీ తీర్థం స్వీకరించారు. పశ్చిమ బెంగాల్లో జరుగనున్న ఎన్నికలకు ముందు బీజేపీ, టీఎంసీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు మరో సినీ నటుడు యశ్దాస్ గుప్తా బుధవారం పార్టీ పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జి కైలాష్ విజయవర్గియా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్గుప్తా సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో పలువురు టీఎంసీ పార్టీలో చేరారు. ఇందులో క్రికెటర్ మనోజ్ తివారీ, ముగ్గురు బెంగాలీ సినీతారలు రాజ్ చక్రవర్తి, కాంచన్ ముల్లిక్, సయోని ఘోష్ టీఎంసీ తీర్థం స్వీకరించారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీతారలతో పాటు ప్రముఖులు అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.